- బీహార్లో ముగ్గురు అరెస్టు
న్యూఢిల్లీ : పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాల లీకేజీ కేసుల్లో నిందితులను సత్వరగతిన విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు అధికారమిస్తూ, ఆ కేసుల్లో శిక్షలను పెంచుతూ సవరించిన చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర లభించింది. ఈ వారం ప్రారంభంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండమెంట్ బిల్, 2026ను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. ఈ చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆమోదాన్ని తెలియజేశారని శుక్రవారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్లో న్యాయ శాఖ పేర్కొంది. ఇకపై రెండు మాసాల్లోనే పేపర్ లీకుల కేసుల్లో విచారణ పూర్తి కావాల్సి వుంది. పేపర్ లీక్లకు లేదా అక్రమ పద్దతులకు పాల్పడిన వారు కనీసం ఐదేళ్లు గరిష్టంగా పదేళ్లు శిక్షను ఎదుర్కొనాల్సి వుంటుంది. రూ.50లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. వ్యవస్థీకృత నేరాలకు కనీసం ఏడేళ్లు శిక్ష వేయాలని ఈ చట్టం ప్రతిపాదిస్తోంది. రూ.10 కోట్లవరకు జరిమానా విధిస్తారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఒఎంఆర్ షీట్ల తారుమారు, నకిలీ వెబ్సైట్ల రూపకల్పన, నకిలీ అడ్మిట్ కార్డుల జారీ వంటి 15 చట్టవిరుద్ధమైన చర్యలను ఈ చట్టం పేర్కొంటోంది.
బీహార్లో నిందితుల అరెస్టు
ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించి బీహార్లో ప్రశ్నా పత్రం లీక్ అయిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈ కారణంగా ఈ నెల 5న జరగాల్సిన హవల్దార్ ఇనస్ట్రక్టర్ పరీక్షను తదుపరి సమాచారం ఇచ్చేవరకు వాయిదా వేశారు. బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమిషన్ (బిపిఎస్ఎస్సి) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం అరెస్టయిన ముగ్గురిలో ఒకరైన సమదర్శి బుధవారం జరిగిన హోం గార్డ్ సర్వీస్ ఇనస్ర్టక్టర్ పరీక్షకు హజిపూర్లో హాజరయ్యారు. సమదర్శి ఇంటరాగేషన్లో మరో ఇద్దరి ప్రమేయం వున్నట్లు బయటపడింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అసిస్టెంట్ ఎలక్షన్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎఇడిఓ) పరీక్షల్లోనూ ఇదే తరహాలో పేపర్ లీకేజీ జరిగిందని వారు తెలిపారు. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ లోని సెక్షన్లు 10, 11(1) కింద కేసు నమోదైంది.








కామెంట్లు (0)