మహారాష్ట్ర : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) కన్వీనర్ అభిజీత్ దీప్కేపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించి, అధికారిక విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై దీప్కేతో పాటు పార్టీ కార్యకర్త అజింక్య షిండే, ఇతర సీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే సమయంలో అనుమతి లేకుండా సీజేపీ కార్యకర్తలు పాఠశాలలను సందర్శించడంపై ఆంక్షలు విధించారు. లాతూర్ జిల్లాలోని ఔసా సమీప జవాలిలో ఉన్న జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని, ఉపాధ్యాయులను బెదిరించారని దీప్కే, ఆయన సహచరులపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సయ్యద్ షంషాద్బానో ఖైరతాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
దీప్కేపై ఆరోపణలు ....
ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం, బలప్రయోగం చేయడం తదితర ఆరోపణలపై దీప్కే, ఇతరులపై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే దీప్కే, ఆయన సహచరులు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించారు. విద్యార్థులతో కలిసి కూర్చుని పాఠశాల పరిస్థితులపై ప్రశ్నలు అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విద్యా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగిందని ఆరోపించారు. పాఠశాల సందర్శన, విద్యార్థులతో సంభాషణకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో పాఠశాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చి తరగతి గదుల్లో కూర్చోబెట్టడం ద్వారా జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయిస్తానంటూ బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో తెలిపారు.
‘స్కూల్ థీక్ కరో’ ప్రచారం ...
దేశ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న ప్రారంభించిన ‘స్కూల్ థీక్ కరో’ ప్రచారంలో భాగంగా సీజేపీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ ప్రచారాన్ని చేపట్టినట్లు పార్టీ పేర్కొంది. దీప్కే స్వగ్రామమైన హింగోలిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సీజేపీ సభ్యుల పాఠశాల సందర్శనలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల జైపూర్లోని రాంపురా కన్వర్పురా ప్రభుత్వ పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన సీజేపీ బృందంపై దాడి జరిగినట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, ముంబయిలో అనుమతి లేకుండా సీజేపీ వాలంటీర్లు మున్సిపల్ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా విద్యాశాఖ నిషేధం విధించింది.








కామెంట్లు (0)