- 25మందికి గాయాలు
- మహారాష్ట్రలో దుర్ఘటన
ముంబయి : మహారాష్ట్రలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్భని జిల్లాలోని మనవత్ తాలుకాలో యశ్వాడి గ్రామంలో హనుమాన్ ఆలయ మండపం పై కప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 25మంది గాయపడ్డారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గల ఈ మండపంలో కార్యక్రమాలు జరుగుతుండగా ఒక్కసారిగా పై కప్పు కొంత భాగం విరిగిపడడంతో ఏం జరుగుతోందో తెలియక భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ మండపం నిర్మాణంలో ఉందని, దాని పై కప్పు మధ్యాహ్న సమయంలో విరిగిపడిందని పోలీసులు తెలిపారు. శనివారం కావడంతో ప్రార్ధనలు, సామూహిక భోజనాల కోసం ఆ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలో వున్నారని చెప్పారు. ఇప్పటివరకు శిధిలాల కింద నుండి 32మందిని తొలగించారు. వారిలో ఏడుగురు చనిపోయారని జిల్లా కలెక్టర్ సంజయ్ చవాన్ తెలిపారు. పోలీసులు, విపత్తు నిర్వహణా బృందం సభ్యులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది, స్థానికులు ఇలా అందరూ సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. పైకప్పు కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. పర్బనీ ఎంపి, ఎంఎల్ఎలు బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.








కామెంట్లు (0)