న్యూ ఢిల్లీ : రాజధాని ఢిల్లీలో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక తేమ కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని, కొందరు బాధితుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తాజాగా ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది హెచ్1ఎన్1 బారినపడినట్లు సమాచారం. ఇదే సమయంలో ఫ్లూ తరహా లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో పలువురు వైద్యులను సంప్రదిస్తున్నారు. హెచ్1ఎన్1 సోకిన వారిలో సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం రావడం, పొడి దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, చలి, తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రతి జ్వరాన్ని స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని, లక్షణాలు తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ లక్షణాలుంటే అప్రమత్తం కావాలి ....
జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, తగ్గని అధిక జ్వరం, గందరగోళం, పెదాలు నీలం రంగులోకి మారడం లేదా లక్షణాలు క్రమంగా తీవ్రమవడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, మధుమేహం ఉన్నవారు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
వ్యాప్తిని నివారించాలంటే ....
ఫ్లూ, ఇతర శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం, దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం, లక్షణాలు ఉన్న సమయంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అదే సమయంలో నిర్లక్ష్యం కూడా తగదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో పాటు లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందా? అనే అంశాలను గమనించి, అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం కీలకమని సూచిస్తున్నారు.







కామెంట్లు (0)