- ధర్మేంద్ర రాజీనామా ప్రజాస్వామ్య విజయం
- అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు
- సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశాన్ని కుదిపేసిన బొద్దికల ఉద్యమం కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని, నిరసనను విరమించడమంటే ఉద్యమం ముగిసిపోయినట్లు కాదని స్పష్టం చేశారు. ‘‘కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ఇంతకాలం అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బొద్దింకలు శాంతియుతంగా ఉద్యమించాయని ప్రశంసించారు. కఠినమైన పరిస్థితులెదుర్కొన్నా ఉద్యమం నడిచిన 37 రోజులూ చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని సిజెపి నాయకుడు అభిజిత్ తెలిపారు. ఈ పరిస్థితులను తనతోపాటు బృందంలోని సభ్యులు కూడా ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. పాలకపార్టీ మద్దతుదారుల విమర్శలు, అవమానాలు, సందేహాలు లేవనెత్తినప్పటికీ అనేక మంది తమపై నమ్మకముంచి అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశమంతటా సిజెపికి మద్దతు లభించిందన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా జంతర్ మంతర్ వద్ద ఎక్కువ మందిని కలవలేకపోయానన్నారు. అందుకు క్షమాపణలు కోరారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం అందించాల్సిందేనన్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. గతవారం జరిగిన ‘ఛలో సంసద్’కు సంబంధించి ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ తక్షణ ప్రాధాన్యత కాదు : సౌరవ్ దాస్ ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడం తమ సంస్థ తక్షణ ప్రాధాన్యత కాదని సిజెపి నాయకుడు సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. "సుమారు 750 - 800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ఏదీ యువత ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. అధికారంలో ఏ పార్టీ లేదా నాయకుడు ఉన్నప్పటికీ, వారు యువత కోసం పనిచేసేలా, వారి డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి మా అజెండా ఇదే" అని ఆయన అన్నారు. విద్య, పాలనలో సంస్కరణల కోసం కృషి చేస్తూనే, యువతను ప్రభావితం చేసే అంశాలను తమ సంస్థ లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. యువత సమిష్టి పోరాట శక్తిని ఈ ఉద్యమం చాటిచెప్పిందని సిజెపి ప్రతినిధి నేహా బోరా అన్నారు. విద్యార్థి సంఘాలు కీలకంగా వ్యవహరించాయి : అశుతోష్ రంకా “ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఇతర విద్యార్థి సంఘాలకు వారి మద్దతు, మార్గదర్శకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఉద్యమంలో మీ పాత్ర నిజంగా కీలకమైనది” అని సిజెపి ప్రతినిధి అశుతోష్ రంకా అన్నారు. తమ సంస్థ తక్షణ దృష్టి ఉద్యమ విస్తరణపైనే ఉందని అన్నారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. "ప్రజా జీవితం, రాజకీయాల్లో నా స్వల్పకాలిక ప్రస్థానంలో నేను నేర్చుకున్న ఏకైక విషయం ఏమిటంటే - ఎప్పుడూ 'కాదు' అని చెప్పకూడదు" అని అన్నారు. దేశ విద్యా వ్యవస్థను సంస్కరించడమే తమ తక్షణ ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు.








కామెంట్లు (0)