న్యూఢిల్లీ : అయోధ్య రామ మందిర విరాళాలపై ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బిజెపిపై శుక్రవారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ విరాళాల దోపిడీ 2021లోనే మొదలైందని విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రామ మందిర విరాళాల దొంగతనం ఇప్పుడు మొదలైంది కాదు.. ఇది 2021లోనే దోపిడీ ప్రారంభమైంది. అక్కడ భారీ భూ కుంభకోణం జరిగింది. రూ. 2 కోట్ల విలువైన భూమిని ఆలయ ట్రస్ట్కు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే రూ. 18 కోట్లకు విక్రయించారు. అదేవిధంగా రూ. 3 కోట్ల విలువైన భూమిని రూ. 24 కోట్లకు, రూ. 9 కోట్ల విలువైన భూమిని రూ. 55 కోట్లకు, అలాగే రూ. 14 కోట్ల విలువైన భూమిని రూ. 95 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి’ అని ఆయన ఆరోపించారు.
ఆలయ నిర్మాణ కాంట్రాక్టుల కేటాయింపులో కూడా అక్రమాలు జరిగాయని ఢిల్లీ మాజీ సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆలయ నిర్మాణం ప్రారంభమైనప్పుడు, ప్రతి టెండర్పైనా 40 శాతం కమిషన్ తీసుకున్నారని ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. వారు (బిజెపి నేతలు) దేవుడినే ఇలా మోసం చేశారని కేజ్రీవాల్ విమర్శించారు. ఆలయానికి విరాళంగా ఇచ్చిన అనేక విలువైన వస్తువులు మాయమయ్యాయని కేజ్రీవాల్ ఆరోపించారు. గోవాతో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించారు. అయితే ఇప్పుడు విరాళాల అవకతవకల వార్తలతో వారు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
విరాళాల వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న వివరాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. శ్రీరాముని హారం, పాదుకలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భక్తులు సమర్పించిన వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయి. వెండి ఇటుకలు, వెండి దీపాలు, నగదు విరాళాలు కూడా దొంగతనానినికి గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ ప్రజల విశ్వాసం మరింతగా దెబ్బతింటోంది అని కేజ్రీవాల్ ఆరోపించారు.








కామెంట్లు (0)