ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రధాని మోడీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత గౌరవం

2 గంటల క్రితం

Uzbekistan's highest honor for Prime Minister Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 03:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఉజ్బెకిస్తాన్ : ప్రధాని మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం దక్కింది. ఉజ్జెకిస్థాన్ స్వాతంత్ర్యం 35వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఓలీ దరాజ్లీ దోస్త్లిక్’ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్‌కు.. దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఓలీ దరాజ్లీ దోస్త్లిక్ పురస్కారాన్ని ప్రధాని మోడీ భారతీయులకు అంకితం చేశారు.


ఇక ప్రధాని మోడీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మధ్య ఆదివారం తాష్కెంట్‌లో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. కుక్సారోయ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత్‌-ఉజ్బెకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించేందుకు ప్రాధాన్యతా అంశాలు, కార్యాచరణ ప్రణాళికపై కూడా మోడీ, మిర్జియోయెవ్ చర్చలు జరిపారు. భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.


మోడీకి ఘన స్వాగతం ...

అంతకుముందు తాష్కెంట్‌లో ప్రధాని మోడీకి అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. శనివారం ఉజ్బెకిస్థాన్ చేరుకున్న మోడీకి మిర్జియోయెవ్ విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి కారులో అధ్యక్ష భవనానికి వెళ్లారు. ఆ తర్వాత విందు సమావేశంలోనూ పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్‌కు ఇది మోడీ నాలుగో పర్యటన. ప్రధాని పర్యటన సందర్భంగా తాష్కెంట్‌లోని హిల్టన్ హోటల్ సహా పలు ప్రముఖ భవనాలను భారత త్రివర్ణ పతాకంలోని రంగులతో అలంకరించారు. భారత ప్రవాసులు కూడా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భారత, ఉజ్బెక్ సంప్రదాయాలను మేళవించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


యోగా కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ...

తన పర్యటనలో భాగంగా మోడీ ఉజ్బెకిస్థాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సమాజంతో తన సమావేశాలు, యాంగీ ఉజ్బెకిస్థాన్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించడం తదితర కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. భారత ప్రవాసులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా మోడీ ప్రశంసించారు. ‘ఉడే జబ్ జబ్ జుల్ఫేన్ తేరీ’ పాటకు బాలీవుడ్ బ్యాటిల్ గ్రూప్ ప్రదర్శన, కథక్-అందిజన్ పోల్కా ఫ్యూజన్, లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ విద్యార్థుల కథక్ ప్రదర్శనలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.


యాంగీ ఉజ్బెకిస్థాన్ పార్క్ సందర్శన

మోడీ యాంగీ ఉజ్బెకిస్థాన్ పార్క్‌ను కూడా సందర్శించారు. అక్కడి స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మిర్జియోయెవ్ కూడా మోడీ వెంట ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్