mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫుట్‌‌పాత్‌‌పై నడవడం ప్రాధమిక హక్కే

1 గంట క్రితం

walking
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 01:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దీనికి చట్టం కావాలన్న సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : స్పష్టంగా గుర్తించబడి, చక్కగా నిర్వహించబడుతున్న ఫుట్‌‌పాత్‌‌లపై నడవడం ప్రాధమిక హక్కేనని సుప్రీం కోర్టు శుక్రవారం ప్రకటించింది. దీనికి ఒక చట్టం కూడా వుండాలని సూచించింది. ‘ఒక రోడ్డు వుందంటే, దానికి ఫుట్‌‌పాత్‌‌ను స్పష్టంగా ఏర్పాటు చేయాలి, దానిపై ప్రజలు నడిచేందుకు వీలుగా చక్కగా నిర్వహించాలి. ఇది తప్పనిసరిగా అమలు చేయాల్సిన విధి. మోటారు వాహనాల రాకపోకల కంటే కూడా ఈ నడకకే ప్రాధాన్యత వుండాలి.’ అని జస్టిస్‌ ‌పి.ఎస్‌.నరసింహా వ్యాఖ్యానించారు. తన తండ్రితో కలిసి పక్కనే గల స్కూలుకు వెళుతున్న ఐదేళ్ళ బాలుడిపైనుండి ట్రక్కు వెళ్ళడంతో ఆ బాలుడు మరణించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. ప్రతి మలుపులోనూ ఎలాంటి ప్రమాదం పొంచి వుంటుందనే భయం లేకుండా కాలిబాటలపై సురక్షితంగా, నిశ్చింతగా నడవడమనేది అత్యంత ప్రాధమిక హక్కని జస్టిస్‌ ‌నరసింహా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం కూడా ఈ హక్కును గుర్తించిందన్నారు. కొన్నేళ్ళుగా ఆర్థిక వ్యవస్థ డిమాండ్లు పెరగడం, వాణిజ్యం, పట్టణీకరణ వంటి కారణాలతో నడక అనేది అత్యంత అసౌకర్యమైన అంశంగా మారిపోయిందన్నారు. రద్దీగా సాగే వాహనాల రాకపోకలు మనుష్యుల అంచనాలను మించి పోయి నడకలోని ఆనందాన్ని అనుభవంలోకి రాకుండా చేస్తున్నాయన్నారు. రాజ్యాంగంలోని 19(1)(ఎ), (బి), (సి) అధికరణల కింద నడక అనేది కేవలం ఒక చలనం మాత్రమే కాదన్నారు. కచ్చితంగా అందులో భావ ప్రకటన, సంఘపరమైన, సామూహికపరమైన హక్కులు వుంటాయని జస్టిస్‌ ‌నరసింహా పేర్కొన్నారు. ఈ నడక కోసం ప్రత్యేకంగా చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం వుందని కోర్టు స్పష్టం చేసింది. నడకను ప్రాధమిక హక్కుగా గుర్తించడమే కాదు, ఇందుకు బాధ్యత వహించే వారిని గుర్తించడానికి కూడా చట్టం కావాలని పేర్కొంది. ప్రతిపాదిత చట్టం ఉల్లంఘనలకు తక్షణ నివారణ చర్యలు అందించాలని, అలాగే దీన్ని అమలు చేసేందుకు పూర్తి స్థాయి రెగ్యులేటర్‌‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్