లోక్సభ వర్షాకాల సమావేశాల మొత్తం కాలంలో అమిత్ షా గైర్హాజరు కావడం అత్యంత విడ్డూరమైంది. ఆయన పార్లమెంటు ప్రాంగణంలోనే వున్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే సభకు దూరంగా ఉండిపోయారు. పార్లమెంటుకు నిరసన ప్రదర్శనగా వెళ్తున్న విద్యార్థులు, యువతపై జంతర్ మంతర్ వద్ద జరిగిన అమానుషమైన దాడులు తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి. దాంతో మొత్తం ప్రతిపక్షాలు హోం మంత్రి నిర్దిష్ట సంజాయిషీ ఇవ్వాలని ఒక్కుమ్మడిగా పట్టు పట్టడం ఆయనను ఇరాకటంలో పడేసింది.
ఢిల్లీ పోలీసులు అలాగే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రదర్శించిన విషపూరితమైన క్రూరత్వాన్ని స్వతంత్ర సిటిజన్ జర్నలిస్టులు, యూట్యూబర్లు యథాతథంగా నమోదు చేశారు. ముల్లుల లాఠీలు, పెల్లెట్ తుపాకులను ప్రయోగించడంతో దాదాపు డజను మంది కార్యకర్తలు గాయపడ్డారన్న విషయం ఫక్కా వైద్యపరమైన ఆధారాలతో రుజువైంది. ఢిల్లీ పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ మొదట్లో దీనిని తీవ్రంగా ఖండించినప్పటికీ ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆందోళన ఎంతమాత్రం శాంతియుతంగా జరగలేదని అంటున్నా దాన్ని నిరూపించే ఎలాంటి సాక్ష్యాధారాలనూ వారు చూపించలేకపోయారు. మహిళా నిరసనకారుల మర్మాంగాలపై లాఠీలతో దాడి చేయడం పోలీసు దౌర్జన్యకాండలో అత్యంత దారుణమైన మరో పార్శ్యంగా బయటికొచ్చింది.
అమిత్ షా పాత్ర
ఈ ఘర్షణ సమయంలో, యూనిఫాంలో వున్న అనేకమంది భద్రతా సిబ్బంది తమ పేరున్న కార్డులను పెట్టుకోలేదని కూడా స్పష్టమైంది. ఈ అనామోదయోగ్యమైన, చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడాలన్న వారి రహస్య పథకాలు దీన్నిబట్టి బహిర్గతమైనాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాలకు విరుద్ధమైన చర్యలకు పోలీసులు పాల్పడ్డారు. ఇన్ని అణచివేత చర్యలకు పాల్పడినప్పటికీ, నిరసన తీవ్రతను అడ్డుకోవడం, వెనక్కి మళ్లించడం, తొక్కి పట్టడంగానీ సాధ్యపడలేదనే వాస్తవం మాత్రం చెరిగిపోయేది కాదు. వాస్తవానికి, జంతర్ మంతర్ ఘటన దేశవ్యాప్తంగా విస్తృతమైన నిరసనల ప్రజ్వలన పరంపరలకు దారితీసింది. ఈ నిరసనల కారణంగా నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రభుత్వం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సహజంగానే, ఇది ప్రతిపక్షాలు ప్రభుత్వ జవాబుదారీతనం కోసం పట్టు పట్టేందుకు కావలసిన స్థైర్యం సమకూర్చింది.
ఇక్కడే అమిత్ షా పాత్ర నిర్ణీతంగా ముందుకొచ్చింది. పహల్గామ్ ఘటనలో జరిగినట్టుగా ఇప్పుడాయన, తన నిర్దిష్ట బాధ్యత నుండి తప్పించుకోవడాన్ని అనుమతించేందుకు ప్రతిపక్షాలు సిద్ధం కాలేదు. ఏదో పైపైన పొంతన లేకుండా కంటి తుడుపు తరహాలో దాటవేత వివరణ కాకుండా, ఢిల్లీ పోలీసుల హింసాకాండకు ఎవరు ప్రేరకులనే దానిపై కచ్చితమైన సమాధానం కావాలని వారు పట్టుపట్టారు. ఇందుకు బాధ్యత ఎవరిదనే విషయం అత్యంత స్పష్టం. బాధ్యతను ఇతరులపైకి నెట్టి తప్పించుకునే అవకాశం అస్సలు లేదు. అందుకే, అమిత్ షా ఇలా చేశారన్నమాట.
అయితే, పరిస్థితుల్లోనూ, ప్రజల ధోరణిలోనూ ఈ లోగా మార్పు వచ్చిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేకపోయింది. భయం కరిగిపోయింది. సమిష్టి సాహసం స్పష్టంగా ప్రత్యక్షమైంది. దీనివల్ల ప్రభుత్వం తన నిస్సహాయ నిస్పృహలో పడిపోయింది. మోడీ చెప్పుకొచ్చిన 'హోమియోపతి మందు', 'దిమాగీ నక్సల్స్’ గురించి మాట్లాడటం తప్ప వారికి గత్యంతరం లేకుండా పోయింది. ఇది హింసాకాండకు పిలుపునివ్వడం పీట వేయడం తప్ప ఏ మాత్రం ఉపేక్షకు తావు లేదని కూడా తేలిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోడీ ఒక కొత్త ‘స్వచ్ఛంద పౌర దళం' ఏర్పాటు గురించి కూడా ప్రస్తావించారు. అది హిట్లర్ తాలూకూ 'ఎస్.ఎస్' దళంలా ఉంటుందా అనేది ఎవరైనా ఊహించుకోవలసిందే.
‘స్వతంత్ర’ ప్రకటన
అయితే ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అమిత్ షా అనుసరిస్తున్న తప్పుడు విధానాల్లో ఇంకా నిర్దాక్షిణ్యమైన మరిన్ని అంశాలను ఎండగట్టవలసే వుంది. స్వతంత్ర భరద్వాజ్ స్వయంగా ఒక ఒప్పుకోలు పాడ్కాస్ట్ విడుదల చేశాడు. తనెంత దురహంకారంగా ప్రవరిస్తాడో, తనకున్న 'హిందూ వీర' ఇమేజ్ కాస్తయినా చెక్కు చెదిరేది కాదో స్వయంగా ప్రకటించుకున్నాడు. నిషు ఆజాద్ తండ్రిపై అతను ప్రాణాంతక దాడి చేశాడన్న విషయం స్పష్టమైపోయింది. ఆ టీనేజ్ అమ్మాయి ఒక దళిత సిజెపి కార్యకర్త. హిందుత్వ శక్తుల పనితీరు ఎంత దారుణంగా ఆమోదించలేనిదిగా వుంటుందో ఎండగట్టే విధంగా ఇన్స్టాగ్రామ్లో కథనాలను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. ఆమె తండ్రిని తాను 60 కత్తి పోట్లు పొడిచి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి కారకుడైనానని స్వతంత్ర భరద్వాజ్ కెమెరా ముందే స్వయంగా చెప్పుకున్నాడు. ఆ తర్వాత తనదైన ధోరణిలో అడ్డగోలుగా మాట్లాడుతూ, తనపై 'హత్యాయత్నం' బిఎన్ఎస్ సెక్షన్ 307 కేసు పెట్టి ఉండాల్సిందన్నాడు. అయితే తనను కనీసం అదుపులోకి తీసుకోవడం కూడా జరగలేదంటూ విరగబాటుగా వికటాట్టహాసం చేశాడు. అపఖ్యాతి పాలైన బిజెపి మంత్రి కపిల్ మిశ్రా ఆశీస్సుల వల్ల, ఢిల్లీ బిజెపిలో బడా నేతలతో ఉన్న పరిచయాల వల్ల తన జోలికే రాలేదని స్వతంత్ర భరద్వాజ్ మరీ మరీ గొప్పలు చెప్పుకున్నాడు. ఏమాత్రం జంకూ గొంకు లేకుండా అతనన్నీ చెప్పేశాడు. 'ముస్లిం ముక్త్ భారత్' సృష్టించడమే తన లక్ష్యమని విశదపర్చాడు. అతని నేరపూరిత ప్రతీ కారకాండకు దళితులు కూడా అతీతులు కారని చెప్పడానికి ఆధారాలున్నాయి. హిందుత్వనూ, బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమిని వ్యతిరేకించే 'దిమాగీ నక్సల్స్' ఎవరైనా సరే వారిపై పడటానికి ఈ 'దిమాగీ హిందుత్వ ఫాసిస్టు' నమూనా తమకు ఎంతో ఇష్టమైన సాధనమనేది అమిత్ షా, నరేంద్ర మోడీలు కాదనలేని విషయం. అయితే, ఆ భావధార భారత రాజ్యాంగానికి, చట్టబద్ధ పాలనకు పూర్తిగా విరుద్ధమైనదనేది వేరే విషయం.
అమిత్ షా - ఢిల్లీ పోలీసులు
అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసు వ్యవస్థ పూర్తి నేరపూరితంగా, రాజకీయ ఆయుధంగా మారిందనేది కళ్ల ముందు కనిపిస్తూనే వుంది. చెప్పిన పనులు చేయడానికి స్వతంత్ర భరద్వాజ్కూ, ఆ బాపతు ఇతరులకూ ఢిల్లీ పోలీసుల బూట్లు, లాఠీలు సమకూర్చబడ్డాయి. జంతర్ మంతర్ నిరసన సమయంలో జరిగిందీ అదే. ఈ విధమైన పరిణామాలు జరిగాయనేదానికి మరో మీడియా కథనం కూడా బలం చేకూరుస్తోంది. జైలులో ఉండాల్సిన సుమారు 300-350 మంది కరుడుగట్టిన నేరస్తులు జులై 20న ఢిల్లీ పోలీసుల నిఘా కెమెరాల్లో చిక్కుకున్నారు! పోలీసులు వారిని తాత్కాలికంగా విడుదల చేసి, నిరసనకారులపైకి ఉసిగొల్పకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.
నైతిక బోధల నిజ రూపం
ఈ దుర్మార్గమైన పరిణామాలు ఒక జిగ్సా పజిల్ లో ముక్కలను ఒక దానితో ఒకటి అతికించేట్లుగా ఉన్నాయి. వ్యక్తిగతంగా రికార్డు చేసినవారికీ యూట్యూబర్లకూ ఇదంతా పూర్తిగా అర్థం కాలేదు. కానీ జరిగిందే అది. ఏదైనా ప్రతిపక్షాన్ని, న్యాయమైన నిరసనను పీక నులమడానికిగాను హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో యూనిఫాంలో ఢిల్లీ పోలీసులు సర్వసన్నద్ధం చేయబడ్డారన్నమాట. ఇది కేవలం రాజ్యాంగ ప్రక్రియనూ యంత్రాంగం, చట్టబద్దపాలన ఘోర దిగజారుడుకు సంకేత మవుతున్నాయి. దాంతోపాటే హిందూత్వమే ఎంతగా దిగజారిందో చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఇతర హిందూత్వ శక్తులు తరచూ గొప్పగా చూపించే నైతిక ఔన్నత్యాల అసలు రూపం కూడా అంతే బూటకమైంది. మహా దృఢశాలి అమిత్ షా అద్దంలో తనను తాను చూసుకోవడం ఇష్టపడటం లేదు మరి!
(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం-సెప్టెంబర్ 9)








కామెంట్లు (0)