భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సహజ వనరులలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ముఖ్యంగా కృష్ణా-గోదావరి (కె.జి) బేసిన్ అత్యంత కీలకమైనవి. దేశ ఇంధన భద్రతలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ ప్రజా సంపదను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అడ్డగోలుగా ధారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను, పర్యావరణాన్ని విస్మరించి కేవలం రిలయన్స్, వేదాంత వంటి ప్రైవేటు సంస్థల లాభార్జనే ధ్యేయంగా చట్టాలను సవరించడం దేశీయ ఆర్థిక సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టుగా మారింది.
ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024: కార్పొరేట్ అనుకూల చట్టం
దేశీయ చమురు, గ్యాస్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'ది ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) సవరణ బిల్లు, 2024'ను తీసుకువచ్చింది. ఈ బిల్లు 2024 డిసెంబరు 3న రాజ్యసభలోనూ, 2025 మార్చి 12న లోక్సభలోనూ ఆమోదించబడింది. ఈ చట్టం పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు సాగిలపడే విధంగా రూపొందించబడింది.
క్రిమినల్ శిక్షల రద్దు – నేరరహితం చేయడం
1948 నాటి పాత చట్టం ప్రకారం, పర్యావరణానికి ముప్పు తెచ్చినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా నిందితులకు 6 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధనలు ఉండేవి. తప్పు చేసిన వారు సమాజంలో తల దించుకునేలా, భయం కలిగి ఉండేలా ఆ శిక్షలు ఉండేవి. కానీ, ప్రస్తుత సవరణ బిల్లు వ్యాపార వాతావరణాన్ని సులభతరం చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనే పేరుతో జైలు శిక్షను పూర్తిగా రద్దు చేసింది. దీని స్థానంలో కేవలం రూ.25 లక్షల జరిమానాను ప్రవేశపెట్టింది. వందల, వేల కోట్లు అక్రమంగా సంపాదించే కార్పొరేట్ శక్తులకు రూ.25 లక్షల జరిమానా అత్యంత స్వల్పమైన మొత్తం. డబ్బుతో శిక్ష నుంచి బైటపడేందుకు, ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వమే ఈ చట్టం ద్వారా దారి చూపిస్తోంది.
ప్రభుత్వ మౌలిక సదుపాయాల లూటీ
ఈ బిల్లు ప్రకారం, మన దేశ అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఒ.ఎన్.జి.సి దశాబ్దాలుగా ఎంతో కష్టపడి, భారీ పెట్టుబడులతో ఏర్పాటు చేసుకున్న రిగ్గులు, పైప్లైన్లు, ఉత్పత్తి, ప్రాసెసింగ్ సౌకర్యాలను ప్రైవేటు ఆపరేటర్లు చట్టబద్ధంగా ఉచితంగా వాడుకోవచ్చు. ఇది ప్రైవేట్ సంస్థల పెట్టుబడి, నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. అంటే, కష్టమంతా ప్రభుత్వ సంస్థది, లాభమంతా ప్రైవేట్ కంపెనీలది అన్నట్లుగా ఈ విధానం ఉంది.
కృష్ణా జిల్లా కాజ బ్లాక్ వ్యవహారం – 'వేదాంత'కు అయాచిత లబ్ధి
కృష్ణా జిల్లాలోని పామర్రు, కాజ బ్లాక్ పరిధిలో ఒ.ఎన్.జి.సి సంస్థ తన సొంత ఖర్చుతో విస్తృతంగా అన్వేషణ జరిపి, భారీగా హైడ్రోకార్బన్ నిల్వలను గుర్తించింది. ఆన్-షోర్లో 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ విలువైన బ్లాక్ను వెలికితీసేందుకు, ప్రభుత్వం ఒఎన్ జిసిని కాదని వేదాంత కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది.
రూ.650 కోట్ల పెట్టుబడితో 30,000 బారళ్ల క్రూడ్ ఆయిల్, 30 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేస్తామని ‘వేదాంత’ చెబుతోంది. ఒకవేళ అక్కడ చమురు దొరకకపోతే ఆ నష్టాన్ని భరించేది ఒఎన్ జిసి. కానీ నిక్షేపాలు దొరికిన తర్వాత అయాచితంగా లాభాలు పొందేది మాత్రం ‘వేదాంత’. దీనినే లాభాలు ప్రైవేటుకు, నష్టాలు జాతీయీకరణకు అంటారు.
స్థానిక ప్రజలకు, పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు
ఈ సవరణ బిల్లు, ప్రైవేట్ సంస్థల ప్రవేశం వల్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి, స్థానిక ప్రజల జీవనోపాధికి తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. పర్యావరణ క్షీణత, ఫ్రాకింగ్ బిల్లు ద్వారా సంప్రదాయ గ్యాస్, ఆయిల్తో పాటు 'షేల్ గ్యాస్' వెలికితీతను సులభతరం చేశారు. షేల్ గ్యాస్ తీయడానికి వాడే 'ఫ్రాకింగ్' పద్ధతి వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతాయి, అంతేకాక భూమి కంపించే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఒకే అనుమతి విధానంతో పర్యావరణ అనుమతులు వేగంగా ఇవ్వడం వల్ల పర్యావరణ రక్షణకు ఎటువంటి గ్యారంటీ లేకుండా పోయింది.
జీవనోపాధి దెబ్బతినడం
కాజ, కెజి బేసిన్ లాంటి తీర ప్రాంతాలలో పైప్లైన్లు వేయడం, రిగ్గులు పెట్టడం వల్ల స్థానిక మత్స్యకారుల వేట దెబ్బతింటుంది. అలాగే బందరు కాలువ ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్న వ్యవసాయ భూములు కలుషితమై రైతులు తీవ్రంగా నష్టపోతారు.
'వేదాంత' కంపెనీ వివాదాల చరిత్ర
'వేదాంత'సంస్థకు పర్యావరణ విధ్వంసం చేసిన చరిత్ర ఉంది. తమిళనాడు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కాలుష్యానికి వ్యతిరేకంగా 2018లో స్థానికులు నిరసన చేసినప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించారు. ఒడిశాలోని నియంగిరి కొండల్లో బాక్సైట్ తవ్వకాల కోసం గిరిజనుల హక్కులను కాలరాచినందుకు 2013లో సుప్రీం కోర్ట్ అక్కడ మైనింగ్ను నిషేధించింది. ఒడిశా ఝార్సుగూడ ప్లాంట్ విషపూరిత వ్యర్థాలను పొలాల్లోకి వదలడం, సెబీ చేత షేర్ల అవకతవకలపై నిషేధానికి గురికావడం, జాంబియా దేశంలో పన్ను ఎగవేత, పర్యావరణ నష్టం కారణంగా గనుల జప్తును ఎదుర్కోవడం వంటి ఎన్నో వివాదాలు 'వేదాంత' చుట్టూ ఉన్నాయి. అటువంటి సంస్థకు మన బందరు కాలువ, కాజ ప్రాంత పర్యావరణాన్ని అప్పగించడం అత్యంత ప్రమాదకరం.
నార్వే దేశ నమూనా – మనకెందుకు సాధ్యం కాదు?
ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన నార్వేలో సహజ వనరులు ప్రజల ఉమ్మడి ఆస్తిగా ఉన్నాయి. అక్కడ చమురు, గ్యాస్ ద్వారా వచ్చే లాభాలను ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా ప్రభుత్వ ఆధీనంలోని సార్వభౌమ నిధిలో జమ చేసి, ప్రజల ఉచిత విద్య, వైద్యం, సామాజిక భద్రతకు వాడుతున్నారు.
కానీ మన దేశంలో రిలయన్స్ వంటి కంపెనీలు కెజి బేసిన్ లోని వనరులను వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాయి. రష్యా నుండి చౌకగా చమురు దిగుమతి చేసుకుని యూరప్కు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు మాత్రం గ్యాస్ కేటాయించడం లేదు. డబ్బులు తీసుకుని కూడా ఇవ్వకుండా, ఇక్కడి గ్యాస్ను 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు.
న్యాయవ్యవస్థ నిర్వీర్యం – వివాదాల పరిష్కారం
ఈ కొత్త బిల్లు ప్రకారం వివాదాల పరిష్కారానికి కోర్టులకు ఎటువంటి అధికారమూ లేదు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఒక అధికారి మాత్రమే వివాదాలను పరిష్కరిస్తారు. అవినీతి వ్యవస్థలో ఇటువంటి అధికారులు ప్రజానుకూలంగా తీర్పులు ఇస్తారని భావించలేము. గతంలో ఒ.ఎన్.జి.సి వెలికితీసిన గ్యాస్ను రిలయన్స్ దొంగతనంగా అమ్ముకున్న వ్యవహారంలో ప్రభుత్వం, కోర్టులు ఏమీ చేయలేక చివరకు రాజీ పడమని సలహా ఇవ్వడమే దీనికి నిదర్శనం.
సహజ వనరులు ప్రజల సొత్తు. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాలు ఎప్పుడైనా ప్రజల ప్రయోజనాలకు లోబడి ఉన్నప్పుడే సమాజం పురోగమిస్తుంది. విలువైన ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం వల్ల ప్రజలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోతారు. పాలకవర్గ పార్టీలు ఈ అన్యాయాన్ని విమర్శించకపోవడం శోచనీయం. మన ప్రయోజనాలను, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా చైతన్యవంతులై, ఇందుకోసం కృషి చేసే వేదికల ద్వారా ఐక్యంగా, పోరాడవలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త -డా. కొల్లా రాజమోహన్
కె.జి.బేసిన్ గ్యాస్ ఆయిల్ సాధన సమితి కన్వీనర్, గుంటూరు.







కామెంట్లు (0)