జులైలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ముందుగా ఊహించిందే. జూన్లో నమోదైన 4.38 శాతం నుంచి జులైలో 4.45 శాతానికి చేరడం గమనార్హం. 2024 డిసెంబర్ తర్వాత, అంటే గత 19 నెలల్లో నమోదైన అత్యధిక స్థాయి ఇది. వరుసగా రెండో నెలలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిర్దేశించిన 4 శాతం లక్ష్యాన్ని దాటి నమోదైంది. అయినప్పటికీ, ఆర్బిఐ నిర్దేశించిన 2 నుంచి 6 శాతం పరిధిలోనే ఇది కొనసాగుతోంది.
ఎప్పటిలాగే ఈసారి కూడా ఆహారం, ఇంధనం, రవాణా రంగాలే ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అరుదైన లోహాలను మినహాయించిన కోర్ ద్రవ్యోల్బణం మాత్రం 3 శాతం లోపే స్థిరంగా ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం జూన్లో 5.45 శాతం నుంచి జూలైలో 5.79 శాతానికి పెరగడం ఆందోళనకరం. ఉల్లిపాయలు (22.54 శాతం), వెల్లుల్లి (35.36 శాతం), అల్లం (83.62 శాతం) వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఈ పెరుగుదలకు ఆజ్యం పోశాయి. బంగాళదుంప (16.56 శాతం) ధరలు కూడా పెరగగా, టమాటా (-4.59 శాతం) ధర మాత్రం తగ్గుముఖం పట్టింది.
రవాణా రంగం ప్రభావం మరింత విస్తృతంగా కనిపిస్తోంది, ఇది ఉత్పత్తి వ్యయాల ఒత్తిడిని సూచిస్తోంది. రవాణా ద్రవ్యోల్బణం జూన్లో 4.31 శాతం నుంచి జులైలో 4.43 శాతానికి పెరిగింది. అలాగే, వస్తు రవాణా సేవల ఉప విభాగంలో ద్రవ్యోల్బణం 7.70 శాతం నుంచి 7.77 శాతానికి ఎగబాకింది. జులై 1న వాణిజ్య ఎల్పిజి ధరలను సుమారు ₹83 మేర తగ్గించినప్పటికీ, ఆహార, పానీయ సేవల ద్రవ్యోల్బణం 7.79 శాతానికి పెరిగింది. మార్చి నుంచి మే వరకు నడిచిన అధిక నిర్వహణ వ్యయాల భారం నుంచి రెస్టారెంట్లు ఇంకా కోలుకోలేదని ఇది సూచిస్తోంది. ఆగస్టు 1న వాణిజ్య ఎల్పిజి ధరలను ₹202 మేర తగ్గించినప్పటికీ, దీని ప్రభావం తక్షణమే మెనూ ధరలపై కనిపించే అవకాశం లేదు.
రుతుపవనాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పశ్చిమ, మధ్య, దక్షిణాది ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం (32.98 శాతం), వెండి (109.84 శాతం) ధరల్లో ద్రవ్యోల్బణం కొంత మోస్తరుగా తగ్గినప్పటికీ, అసాధారణంగా అధిక స్థాయిలోనే కొనసాగుతోంది. జులై సిపిఐ లెక్కింపు కాలంలో ముడి చమురు ధరలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ, ఆగస్టులో మళ్లీ పెరుగుతున్నాయి. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే? రష్యాకు చెందిన నొవొరొస్సియిస్క్తో సహా నల్ల సముద్ర ఎగుమతి మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్కు సంబంధించిన అంతరాయాలు, రష్యా ముడి చమురుపై సరకు రవాణా, రిస్క్ ప్రీమియంలను పెంచే అవకాశం ఉంది. జూన్లో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో దాదాపు సగం రష్యా నుంచే వచ్చింది కావడంతో, ఇలాంటి అంతరాయాలు దేశ ఇంధన వ్యయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. జూన్ 15 నుంచి జూలై 15 సిపిఐ లెక్కింపు కాలంలో రూపాయి విలువ దాదాపు 1.6 శాతం క్షీణించడం, దిగుమతి ఆధారిత ద్రవ్యోల్బణాన్ని మరింత తీవ్రతరం చేసింది.
ఈ నేపథ్యంలో, ఆర్థిక వృద్ధి వేగం మందగిస్తున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. హెచ్ఎస్బిసి కాంపోజిట్ పిఎంఐ జూన్లో 57.1 శాతంగా ఉండగా, జులైలో 54.3 శాతంకు గణనీయంగా పడిపోయింది. ఇది 2022 మార్చి తర్వాత నమోదైన అత్యంత బలహీన విస్తరణ. పిఎంఐ అనేది అధిక-ఫ్రీక్వెన్సీ సూచీ కావడంతో, దీన్ని దీర్ఘకాలిక ధోరణిగా భావించనవసరం లేకపోయినా, గమనించదగ్గ అంశం మాత్రమే. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే, వరుసగా నాలుగో సమావేశంలోనూ రెపో రేటును ఆర్బిఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపిసి) 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచింది. ఎల్ నినో ఫలితంగా అనావృష్టి పరిస్థితులు, అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం రానున్న రోజుల్లో తీవ్రంగా వుంటుంది. ఏది ఎలావున్నా సామాన్యులపై ధరాభారం మెడపై కత్తిలా వేలాడుతోంది.







కామెంట్లు (0)