అయోధ్య రామాలయ నిర్మాణం పేరిట మత చిచ్చు రేపి దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్, బిజెపి రాజకీయంగా ఎదిగాయి. ఇప్పుడా రామాలయం నిర్మాణ నిర్వహణలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు గుప్పుమనడం పరివార్ శక్తుల బండారాన్ని వెల్లడిస్తోంది. మసీదు కూల్చివేత అనంతరం, భూకబ్జాలు కూడా ఊపందుకున్న విషయం తెలిసిందే! ప్రజల్లో ఉద్వేగం సృష్టించి, అనేక మంది మరణానికి కారమై, కార్పొరేట్ శక్తుల అండదండలతో ఢిల్లీ పీఠాన్ని అధిష్టించారు. వారు కేంద్రంలో తమ పరిపాలనా పలుకుబడిని దుర్వినియోగం చేసి సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన తీర్పును పొందారన్నది జనవాక్యం. రామ మందిర నిర్మాణానికి నేరుగా నరేంద్ర మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించింది. రామ మందిర దర్శనం కోసం యాత్రికులను అయోధ్యకు తరలించే బాధ్యతను కూడా సంఘ్ పరివార్ తీసుకుంది. భక్తుల నుంచి ప్రతిరోజూ విరాళాల రూపంలో కోట్లాది రూపాయలు వచ్చిపడ్డాయి. ఆలయానికి విరాళంగా వచ్చిన కోట్ల రూపాయలలో అధిక భాగాన్ని సంఘ్ పరివార్ నాయకత్వమే దొంగిలించిందనే తీవ్రమైన ఆరోపణ , అదీ సంఘ్ పరివార్ నుంచే రావడం గమనార్హం. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్.కె. అద్వానీతో పాటు సహ నిందితుడిగా ఉన్న సంతోష్ దుబే ప్రధాన ఫిర్యాదుదారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో, రామ మందిర నిధి నుంచి రూ. 200 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని దుబే ఆరోపించారు. ప్రతిరోజూ నగదు, బంగారం, వెండి ఆభరణాలు మొదలైన రూపాల్లో ఆలయ ఖజానాలో కోటి రూపాయలకు పైగా జమ అవుతోంది. ఇందులో అధిక భాగాన్ని ట్రస్ట్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. సీనియర్ బిజెపి నాయకుడు రజనీష్ సింగ్ కూడా దుబే ఫిర్యాదును సమర్థించారు. ఆనాడు ముందుండి నడిపించిన బజరంగ్ దళ్ వ్యవస్థాపకుడు, బిజెపి నాయకుడు వినయ్ కటియార్ అయితే మరింత ముందుకుపోయి రామ మందిర ట్రస్ట్లోని ప్రతి ఒక్కరూ దొంగలేనని బహిరంగంగా అనడం కుంభకోణం తీవ్రతకు నిదర్శనం. రామ మందిర కుంభకోణం గురించి తనకు చాలా తెలుసని, అయితే ట్రస్ట్ అధికారులు పెద్ద తలకాయలు కావడంతో భయంగా ఉందని మాజీ బిజెపి ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కూడా మీడియాతో చెప్పారు
రామ మందిర ట్రస్ట్లో ఆర్ఎస్ఎస్ నామినీ అయిన వీహెచ్పి నాయకుడు ,ఆలయ ట్రస్ట్కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంపత్ రాయ్పై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. ట్రస్ట్ సభ్యుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న గోపాల్ రావులపై కూడా ఆరోపణలున్నాయి. సమాజ్వాదీ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు రామమందిర కుంభకోణంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల నుంచి నిష్పక్షపాత విచారణకు అవకాశం లేనందున, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ప్రతిపక్షం చేస్తున్న డిమాండ్ సబబయినదే! దీనికి అంగీకరించకుండా, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సిట్కు దర్యాప్తును అప్పగించడం వెనుక గల రహస్యం ఎవరూ ఉహించలేనిది కాదు. చంపత్ రాయ్తో సహా సంఘ్ పరివార్ నాయకులను కాపాడటంలోనే కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలకు ఆసక్తి ఉంటుందని వేరుగా చెప్పనక్కరలేదు. రామ మందిరం చుట్టూ గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. బాబ్రీ మసీదు కేసులో తొలి పిటిషనర్ అయిన నిర్మోహి అఖారా, రామ మందిర ఉద్యమ సమయంలోనే విరాళాల రూపంలో అందుకున్న రూ. 1,000 కోట్లకు పైగా సొమ్మును విశ్వహిందూ పరిషత్ దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, విస్తృతమైన భూ ఒప్పందాల అవకతవకలు కూడా వెలుగులోకి వచ్చాయి. రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసిన భూమిని కొద్ది రోజులకే రూ. 18.5 కోట్లకు ఒక ట్రస్టుకు అమ్మిన పత్రాలు లీక్ అయ్యాయి. ఇదంతా కప్పిపుచ్చిన తర్వాతే విరాళాల దుర్వినియోగంపై ప్రస్తుత ఆరోపణలు వచ్చాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ రామమందిర కుంభకోణం సంఘ్ పరివార్కు పెద్ద సంక్షోభాన్ని సృష్టించవచ్చు.








కామెంట్లు (0)