దుబాయ్: ఐసీసీ మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. మ్యాచ్లు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (ముంబయి), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఇందులో పోటీపడనున్నాయి. ఈ లెక్కన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నమెంట్కు దూరమైంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన టీమ్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్కు అర్హత సాధిస్తాయి.
మహిళల చాంపియన్స్ ట్రోఫీ-2027 మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక ఐసీసీ మహిళల టోర్నమెంట్ జరుగుతుండటం మహిళల క్రికెట్కు, క్రీడాకారిణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు జోష్ ఇస్తుందన్నారు.
కాగా తొలుత ఛాంపియన్ట్రోఫీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న శ్రీలంక బోర్డు 'ట్రాన్స్ఫార్మేషన్ కమిటీ' అనే తాత్కాలిక బోర్డు పర్యవేక్షణలో ఉంది. శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ, బోర్డు రాజ్యాంగ సవరణలతో సహా కీలకమైన మార్పులను పర్యవేక్షిస్తుంది. క్రీడల్లో రాజకీయపరంగా నియమించబడిన పాలకవర్గాలను ఐసిసి గుర్తించదు, పైగా ఈ ట్రాన్స్ఫార్మేషన్ కమిటీ ఏర్పాటైనప్పటి నుండి ఐసిసి బోర్డు సమావేశాలకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతినిధులు హాజరుకాలేదు. దీంతో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను శ్రీలంక నుంచి వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలోనే ఐసిసి బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికాలలో టోర్నీ నిర్వహణకు వేదికలను పరిశీలించింది. కానీ మూడు అభ్యర్థులను అంచనా వేసి, ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్ను సిఫార్సు చేసింది.








కామెంట్లు (0)