సుందర్, నితీశ్, హర్షిత్లకూ చోటు
ఆఫ్ఘనిస్తాన్తో టి20 సిరీస్కు జట్టు ప్రకటన
ముంబయి: ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టి20 సిరీస్కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) జట్టును ప్రకటించింది. గాయాలతో జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రాతోపాటు ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్లకు చోటు లభించింది. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న వీరంతా ఫిట్నెస్ నిరూపించుకోవడంతో వీరందరినీ బిసిసిఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. మంగళవారం సెలెక్టర్లు ప్రకటించిన జట్టుకు శ్రేయాస్ అయ్యర్ సారథిగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా 15మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. జింబాబ్వే పర్యటనలో ఓపెనర్గా మెరిసిన వైభవ్ సూర్యవంశీ స్థానం నిలబెట్టుకోగా.. వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు కూడా చోటు లభించింది. రాబోయే సిరీస్లను దృష్టిలో ఉంచుకొని మాజీ కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లను సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అలాగే గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్గా స్థానం సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్కు అఫ్గన్ సిరీస్లో చోటు దక్కలేదు. సెప్టెంబర్ 13నుంచి అఫ్గనిస్థాన్తో మూడు టి20ల సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 15న రెండో మ్యాచ్,17న మూడో టీ20 జరగనుంది.
భారత టి20 జట్టు: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్లు), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ కుమార్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బుమ్రా, ఆర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా.








కామెంట్లు (0)