సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ కూడా..
ప్రీ క్వార్టర్స్లో ఓడిన సింధు, ఆయుశ్
బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
న్యూఢిల్లీ: బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ సింగిల్స్లో పివి సింధు, ఆయుశ్ శెట్టి పోరాటం ప్రీ క్వార్టర్ ఫైనల్లో ముగియగా.. మహిళల, పురుషుల డబుల్స్లో భారత షట్లర్లు క్వార్టర్ఫైనల్కు చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. ఈ జోడీలు సెమీస్కు చేరితే కనీసం కాంస్య పతకం ఖాయం కానుంది. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్లో సింధు 11-21, 21-15, 17-21తో 3వ సీడ్, చైనా షట్లర్ వాంగ్ చేతిలో ఓటమిపాలైంది. ఇకపురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వీ ఫర్హాన్ చేతిలో 19-21, 11-21తో వరుస గేముల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో తొలిరౌండ్లో ప్రపంచ నంబర్ వన్ షి యూకీని ఓడించి సంచలనం సృష్టించిన ఆయుష్.. ప్రీ-క్వార్టర్ ఫైనల్లోనే తన ప్రయాణాన్ని ముగించాడు. మిక్స్డ్ డబుల్స్లో ధృవ్ కపిల-తానీసా కాస్ట్రో పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్లో వీరు 16-21, 5-21తో 6వ సీడ్, చైనా షట్లర్ల చేతిలో చిత్తుగా ఓడారు.
క్వార్టర్స్కు గాయత్రి, త్రీసా జోడీ...
మహిళల డబుల్స్లో గాయత్రీ గోపీచంద్-త్రీసా జోలీ జంట సంచలనం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఏకంగా ఏడో సీడ్ను జంటను చిత్తుచేశారు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్లో గాయత్రి-త్రీసా జంట 21-16, 21-12తో జపాన్కు చెందిన కీ నకనిశి జంటకు షాక్ ఇచ్చారు. తొలి సెట్ను 21-16తో నెగ్గిన భారత అమ్మాయిలు.. రెండో సెట్నూ 21-12తో సెట్ను గెలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. ఆ తర్వాతి రౌండ్లో గాయత్రి-త్రీసా జంటకు నాలుగో సీడ్ జియా యీ ఫాన్ – ఘాంగ్ షు గ్జియాన్(చైనా)తో గట్టి పోటీ ఎదురుకానుంది.

ఇక పురుషుల డబుల్స్లో 5వ సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట మూడుసెట్ల హోరాహోరీ పోరులో మలేషియా జంటను చిత్తుచేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ 21-23, 21-19, 21-19తో మలేషియాకు చెందిన ఆరిఫ్-యాప్లను చిత్తుచేశారు.







కామెంట్లు (0)