- అర్జెంటీనా చేతిలో 5-3తో ఓటమి
- సెమీస్కు నెదర్లాండ్స్, అర్జెంటీనా
అమ్స్టెల్వీన్(నెదర్లాండ్స్): 2026 హాకీ వరల్డ్కప్లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. సెమీస్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు 5-3గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. వాఘెనార్ హాకీ స్టేడియంలో సోమవారం జరిగిన పూల్-ఇ కీలకపోరులో భారతజట్టు మ్యాచ్ ప్రారంభమైన 41సెకన్లలోనే అర్జెంటీనాకు గోల్ సమర్పించుకొంది. ఆ తర్వాత 6వ నిమిషంలో మరో గోల్ సమర్పించుకోగా.. 10వ నిమిషంలో భారత్ తరఫున సుఖ్జీత్ గోల్ చేశాడు. దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 1-2గోల్స్తో వెనుకబడింది. ఆ తర్వాత రెండో క్వార్టర్లో ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-1గోల్స్తో ఆధిక్యతలో నిలిచింది. కానీ మూడో క్వార్టర్లో డోమెట్ థామస్ రెండు గోల్స్తో మెరిసాడు. మూడో క్వార్టర్ ప్రారంభంలోనే 33వ ని.లో, 45వ ని. చివర్లో థామస్ ఈ రెండు గోల్స్ చేయడంలో అర్జెంటీనా 4-1ఆధిక్యతలో నిలిచింది. ఇక నాల్గో, చివరి క్వార్టర్ 53వ ని.లో లూకాస్ మరో గోల్ చేయడంలో అర్జెంటీనా 5-1తో తిరుగులేని ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. చివరి 5నిమిషాల్లో భారత్ తరఫున సింగ్ సుఖ్జీత్, సింగ్ హార్దిక్ ఒక్కో గోల్ చేశారు. దీంతో భారత పురుషుల హాకీ జట్టు రౌండ్-2లో వరుసగా రెండో ఓటమితో సెమీస్కు దూరమైంది. ఈ గ్రూప్ నుంచి నెదర్లాండ్స్, అర్జెంటీనా జట్లు 6 పాయింట్లతో సెమీస్కు చేరాయి. ఈ గ్రూప్నుంచి ఇంగ్లాండ్ సెమీస్కు చేరాలంటే దాదాపు 5గోల్స్ వ్యత్యాసంతో నెదర్లాండ్స్ను ఓడిస్తే అర్జెంటీనా బదులు ఇంగ్లాండ్ సెమీస్కు చేరుతుంది. ఇక పూల్-ఎఫ్ నుంచి జర్మనీ(6పాయింట్లు), స్పెయిన్(4) సెమీస్కు చేరాయి. సెమీస్లో నెదర్లాండ్స్తో స్పెయిన్, జర్మనీతో అర్జెంటీనా తలపడనున్నాయి.








కామెంట్లు (0)