ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నో బాల్స్‌పై గవాస్కర్‌ ఆగ్రహం

1 గంట క్రితం

Gavaskar furious over no-balls
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 02:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

జడేజాకే కాదు.. బౌలింగ్‌ కోచ్‌కూ జరిమానా విధించాలి


క్రీడలు : శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్రమశిక్షణారాహిత్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిరీస్‌ ఆసాంతం పదేపదే క్రీజు దాటి నో బాల్స్‌ వేయడంపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. జడేజాతో పాటు బౌలింగ్‌ కోచ్‌కూ జరిమానా విధించాలని సూచించారు.


శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో జడేజా పలుమార్లు నో బాల్స్‌ వేశారు. 2021 నుంచి ఇప్పటివరకు అతను 85కు పైగా నో బాల్స్‌ వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అతని బౌలింగ్‌లో క్రమశిక్షణ లోపం ఎంతగా ఉందో అర్థమవుతోందని గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. జడేజాతో పాటు అరంగేట్ర స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ కూడా రెండో టెస్టులో పలు నో బాల్స్‌ వేసి నిరాశపరిచారు.


ఈ అంశంపై భారత స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే స్పందిస్తూ ... టెస్టుల్లోనూ నో బాల్‌కు ఫ్రీ హిట్‌ ఇస్తే బౌలర్లు మరింత జాగ్రత్తగా ఉంటారేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. దీనిపై గవాస్కర్‌ తీవ్రంగా స్పందించారు.


టెస్టు క్రికెట్‌లోనే బ్యాటర్లకు పరుగులు చేయడం ఇప్పటికే సులభమవుతోందని, ఓవర్‌కు రెండు బౌన్సర్ల పరిమితి, బౌండరీలను దగ్గరకు తీసుకురావడం వంటి మార్పులు అందుకు కారణమని గవాస్కర్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీ హిట్‌ నిబంధనను తీసుకువచ్చి బ్యాటర్లకు మరింత ప్రయోజనం కల్పించాల్సిన అవసరం లేదన్నారు.


నో బాల్‌ వేయకుండా ఉండటం పూర్తిగా బౌలర్‌ నియంత్రణలోనే ఉంటుందని గవాస్కర్‌ స్పష్టం చేశారు. ఆధునిక క్రికెట్‌లో బౌలర్లు టేప్‌ మెజర్‌తో రనప్‌ మార్క్‌ చేసుకుంటున్నారని, అలాంటప్పుడు పదేపదే నో బాల్స్‌ వేయడాన్ని సమర్థించలేమన్నారు.


ఈ సమస్యకు పరిష్కారంగా గవాస్కర్‌ జరిమానాల విధానాన్ని సూచించారు. నో బాల్‌ వేసిన ఆటగాడికి భారీ జరిమానా విధించాలని, అదే తప్పు మళ్లీ చేస్తే జరిమానాను రెట్టింపు చేయాలని అన్నారు. అంతేకాకుండా ఆటగాడిపై విధించిన జరిమానాలో సగం మొత్తాన్ని బౌలింగ్‌ కోచ్‌ నుంచి కూడా వసూలు చేయాలని సూచించారు. దీంతో ఆటగాళ్లు, కోచ్‌లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


ఈ విధంగా వసూలైన జరిమానా మొత్తంతో సిరీస్‌ ముగిసిన తర్వాత జట్టు సభ్యులందరికీ డిన్నర్‌ ఏర్పాటు చేయవచ్చని గవాస్కర్‌ సూచించారు. తద్వారా జట్టు సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని చెప్పారు.


ఫీల్డింగ్‌లో త్రోకు బ్యాకప్‌ ఇవ్వకపోవడం వంటి చిన్న పొరపాట్లకూ జరిమానాలు విధించే అంశాన్ని జట్టు సభ్యులు ఓటింగ్‌ ద్వారా నిర్ణయించుకోవచ్చని గవాస్కర్‌ సూచించారు. దీనివల్ల క్రమశిక్షణ పెరగడంతో పాటు జట్టులో సరదా వాతావరణం కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్