కొరియా ఓపెన్ సూపర్-300
అసాన్(కొరియా): కొరియా ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్లో యువ సంచలనం తన్వీ శర్మ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీలో తన్వీ శర్మ భారత్కే చెందిన శ్రీయాన్షి వాలిశెట్టిపై మూడుసెట్ల హోరాహోరీ పోరులో విజయం సాధించి క్వార్టర్ఫైనల్కు చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో తన్వీ శర్మ 21-16, 17-21, 21-13తో శ్రీయాన్షిని చిత్తు చేసింది. తొలి గేమ్ తన్వి చేజిక్కించుకోవడానికి గట్టి పోటీ ఎదురైంది. ఆరంభంలో వెనుకబడినా.. చురుకైన కదలికలు, దూకుడు ఆడి చివర్లో కీలక పాయింట్లు సాధించి 21-16తో ఆ గేమ్ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్ను ప్రత్యర్ధికి కోల్పోయినా.. నిర్ణయాత్మక మూడో గేమ్లో తన్వీ ముందు శ్రీయాన్షీ నిలువలేకపోయింది. క్వార్టర్ఫైనల్లో తన్వీ శర్మ భారత్కే చెందిన రక్షిత రామ్రాజ్తో తలపడనుంది. రక్షిత రెండోరౌండ్లో జపాన్కు చెందిన మానమి సుయిజును 22-20, 21-10తో ఓడించి క్వార్టర్ఫైనల్కు చేరింది. గత వారం తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని చేజిక్కించుకొన్న 17ఏళ్ల తన్వీ శర్మ సూపర్-300 టైటిల్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విజయ పరంపరను కొనసాగిస్తూ కొరియా ఓపెన్లోనూ రాణిస్తూ క్వార్టర్ఫైనల్కు చేరారు.








కామెంట్లు (0)