తొలిరౌండ్లోనే ఓడిన కిదాంబి శ్రీకాంత్
సియోల్: కొరియా ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో తైపీ ఓపెన్ ఛాంపియన్ తాన్వీ శర్మ శుభారంభం చేయగా.. మాజీ నంబర్ వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల సింగిల్స్లో మూడో సీడ్గా బరిలోకి దిగిన తాన్వీ శర్మ చైనాకు చెందిన యువాన్ ఆన్ కీని 21-16, 21-15తో ఓడించి రెండో రౌండ్కు చేరుకుంది. మరో భారత షట్లర్ రక్షిత రామ్రాజ్ 22-24, 21-12, 21-13తో కొరియాకు చెందిన యూ ఏ యోన్ను, మాన్సీ సింగ్ 14-21, 21-19, 21-9తో కిమ్ జూ ఉన్(కొరియా) ఓడించి రెండోరౌండ్కు చేరారు. ఇక ఐదో సీడ్ ఇషరాని బరువా 21-18, 15-21, 21-7తో లీ సో యుల్(కొరియా), 8వ సీడ్ అన్మోల్ ఖర్బ్ హాంకాంగ్కు చెందిన లో సిన్ యాన్ హ్యాపీని 16-21, 21-17, 21-12తో, అశ్మిత చలిహా 22-20, 21-18తో జపాన్కు చెందిన రికో హిరమోటోను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ శ్రీకాంత్ 20-22, 21-14, 12-21తో డానియిల్ డుబోవెంకో(ఇజ్రాయేల్)చేతిలో ఓడాడు. ఇక కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్, తరుణ్ మన్నెపల్లి కూడా తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టారు. కిరణ్ 15-21, 9-21తో కొరియాకు చెందిన పార్క్ సాంగ్ యాంగ్ చేతిలో, మిథున్ 11-21, 9-21తో చైనాకు చెందిన జూ షువాన్ చెన్ చేతిలో ఓడారు. ఇక తరుణ్ కొరియాకు చెందిన యూ టే బిన్ చేతిలో 13-21, 21-12, 19-21తో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓడాడు.








కామెంట్లు (0)