తెలంగాణ : హైదరాబాద్ రంజీ జట్టుకు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్గా ఎంపికయ్యారు. 2026-27 రంజీ ట్రోఫీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు సిరాజ్ సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సీనియర్ లెఫ్టార్మ్ పేసర్ చామా మిలింద్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది.
గత సీజన్లో తిలక్ వర్మ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో తిలక్ వర్మ బిజీగా ఉండనున్న నేపథ్యంలో సిరాజ్కు కెప్టెన్సీ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా వ్యవహరించనున్నారు. రంజీ సీజన్లో హైదరాబాద్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో త్రిపురతో హైదరాబాద్ తలపడనుంది. గత సీజన్లో హైదరాబాద్ ఏడు మ్యాచ్ల్లో ఒక విజయం, రెండు పరాజయాలు, నాలుగు డ్రాలతో ముగించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో సిరాజ్ రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 25 ఓవర్లు వేసి 140 పరుగులిచ్చి వికెట్ సాధించలేకపోయినా, రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్పై దృష్టి పెట్టిన సిరాజ్కు రంజీ సారథ్యం కీలకంగా మారింది. 2015లో హైదరాబాద్ తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన సిరాజ్ ఇప్పటివరకు 21 రెడ్బాల్ మ్యాచ్ల్లో 83 వికెట్లు తీశారు. చామా మిలింద్ 57 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 140 వికెట్లు, 1,445 పరుగులు సాధించారు.








కామెంట్లు (0)