హైజంప్లో సర్వేశ్ కుషారే కూడా..
ఆంధ్ర వెయిట్ లిఫ్టర్కు రజత పతకం
పతకాల పట్టికలో 8వ స్థానానికి భారత్
గ్లాస్గో: 23వ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి భారత్కు పతకాల పంట పండింది. మంగళవారం ఒక్కరోజే భారత్కు ఒక స్వర్ణ పతకంతోపాటు మూడు రజత పతకాలు, మరో రెండు కాంస్య పతకాలు దక్కాయి. దీంతో భారతజట్టు ఒకేరోజు ఆరు పతకాలతో అదరగొట్టింది. పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ షాట్పుట్ ఎఫ్57లో కొత్త అధ్యాయం లిఖించింది. ఈ విభాగంలో స్వర్ణం గెలుపొందిన ఆమె.. ఈఘనత సాధించిన తొలి పారా అథ్లెటిక్గా చరిత్ర సృష్టించింది. మహిళల పారా షాట్పుట్ ఫైనల్లో షర్మిలా ఇనుపగుండును ఏకంగా 9.81 మీటర్ల దూరం విసిరి ప్రథమస్థానంలో నిలిచింది. దీంతో ఆమెకు స్వర్ణ పతకం ఖాయమైంది. ఈ విభాగంలోనే శిల్పా కె సైలా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. మహిళల 53కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగ్లో జ్ఞానేశ్వరి యాదవ్ ఇప్పటికే రజత పతకం అందించగా.. మంగళవారం తెలుగు తేజం, శ్రీకాకుళం జిల్లా నెల్లిమర్లకు చెందిన అజయ్ బాబు పురుషుల విభాగం 75కిలోల వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు రజత పతకం సాధించి అంతర్జాతీయ వేదికలపై తెలుగు ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. తండ్రి నల్లూరి శ్రీనివాసరావు 2010 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించగా.. తన తండ్రి స్ఫూర్తితో కొడుకు అజయ్ బాబు కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు.

హైజంప్లో సర్వేశ్కు రజతం..
కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్లో భారత్కు రజత పతకం అందించి సర్వేశ్ కుషారే కొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన హైజంప్ ఫైనల్లో సర్వేశ్ 2.25మీ. జంప్ చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఈ విభాగంలో కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు రజత పతకం దక్కడం ఇదే తొలిసారి. 2022 బర్మింగ్హామ్ క్రీడల్లో తేజస్విని శంకర్ కాంస్య పతకం సాధించగా.. తాజాగా సర్వేశ్ ఆ రికార్డును అధిగమించి రజత పతకం అందించాడు. జమైకాకు చెందిన రొమైనా 2.28జంప్ చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. ఆ ఫీట్ను అందుకోవడంలో సర్వేశ్ విఫలమయ్యాడు. ఇంగ్లండ్కు చెందిన జాక్ కిమానీ(2.20మీ.) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. భారత్కే చెందిన ఆదర్శ రామ్(2.15మీ.) ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.








కామెంట్లు (0)