ప్రియమైన స్నేహితులకు..
ఈ ఏడాది జులై 11,12 తేదీల్లో విజయవాడ ఒన్టౌన్లోని కెబిఎన్ కళాశాల ప్రాంగణంలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలకు నేను కూడా హాజరయ్యా. బహుశా ఈ సభల్లో అతి చిన్న వయస్సు కల దానిని నేనొక్కదానినే అని అనుకుంటున్నా. ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా కొందరు ప్రతినిధులు హాజరైనట్లుగా గమనించా. రచయిత్రులు, ఉపాధ్యాయినులు, ఉద్యోగినులు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలు, సాహిత్యాభిమాను లందరికీ ఈ మహాసభలు ఆత్మీయ స్వాగతం పలికాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం నాలుగు వేదికలపై 24 సదస్సులు, 15 సాంస్కృతిక ప్రదర్శనలు, 500 మంది తెలుగు సాహితీ మూర్తుల ఫోటోల ప్రద్సర్శనలను ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. మహాసభల ప్రచురణగా ‘ప్రమదావనం’ పరిశోధనాగ్రంథాన్ని నాక్కూడా అందజేశారు. ఇక అసలు విషయానికి వస్తున్నా. తెలుగుభాష ఎంతో మధురమైన భాష. నాక్కూడా ఎంతో ఇష్టమైన భాష. ఇప్పుడు ఇంగ్లీషు వ్యామోహంలో పడి తెలుగును మర్చిపోతున్నాం. ఇంగ్లీషును ఉన్నతమైన భాషగా చెప్పుకుంటున్నాం. కొన్ని భాషలు తెలిసుండటం మంచిదే. కానీ మన మాతృభాషను విస్మరిస్తుండటం బాధాకరం. అందుకే మా పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో నేనూ ఈ సభలకు హాజరయ్యా. ‘తెలుగు భాష..మరింత వర్థిల్లాలి’ అనే పేరుతో నేను రాసిన కవితను ఈ మహాసభల రెండోవేదికలో చదివాను. అతిథులు, మహాసభల నిర్వాహకులు నన్నెంతో అభినందించారు. నరసం అధ్యక్షులు,స్త్రీవాద రచయిత్రీ తేళ్ళ అరుణ గారి ఆధ్వర్యంలో సత్కారం కూడా చేయటం నా జీవితంలో మరపురాని సంఘటన. ఇంతటి ఘనత సాధించదానికి మా తెలుగు ఉపాధ్యాయులు దామెర్ల నరసింహారావు గారి ప్రోత్సాహం, మా అమ్మ మాధురీ సుదీష్ణ ఎంతో ప్రేరణగా అన్ని విషయాల్లో నిలిచారు.
తమ్మినేని మోక్షాన్విత
9 వ తరగతి,నాగార్జున విద్యానికేతన్,
కొండపల్లి మున్సిపాలిటీ ,ఇబ్రహీంపట్నం, యన్టిఆర్ జిల్లా.








కామెంట్లు (0)