రాజులు పోయినా.. రాజ్యాలు కనుమరుగైనా.. కొండపల్లి ఖిల్లా రాళ్లలో నిక్షిప్తమైన చరిత్ర మాత్రం నేటికీ సజీవంగానే ఉంది. తూర్పు కనుమల పచ్చని కొండల మధ్య కొలువైన ఈ కోటను చూస్తే అలనాటి రాజసం కళ్లముందు కదలాడినట్లుంటుంది.రాతి గోడలు, బురుజులు, పురాతన ద్వారాలు, శిథిల నిర్మాణాలు ఆనాటి పాలకుల వైభవానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి. కొండపైకి ఎక్కే ప్రతి అడుగులోనూ గతకాలపు అడుగుల చప్పుడు వినిపిస్తున్న అనుభూతి కలుగుతుంది. కోట ఎత్తు నుంచి కనిపించే పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు సందర్శకుల మనసును హరిస్తాయి. ఉదయపు సూర్యకిరణాలు కోట గోడలను తాకుతుంటే చరిత్రకు ప్రకృతి రంగులు అద్దినట్టుగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి విజయవాడకు సమీపంలోనే ఉండటంతో పర్యాటక, ప్రకృతి ప్రేమికులకు ఇది ఆకర్షణీయమైన పర్యాటక గమ్యంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఇక్కడికి వస్తే చరిత్రను ఆస్వాదించడంతోపాటు ప్రకృతి సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించొచ్చు. మరింత మెరుగైన రహదారులు, మౌలిక వసతులు, సమాచార కేంద్రాలు ఏర్పాటైతే కొండపల్లి ఖిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత వెలుగొందుతుంది. సమీపంలోని విజయవాడలో భవానీఐలాండ్, కృష్ణానదీ విహారం, సాగర సంగమం, గాంధీహిల్, విక్టోరియా మ్యూజియం, ఇంద్రకీలాద్రి వంటి ప్రదేశాలు ఉన్నాయి. కోట గోడలు, కొండపల్లి బొమ్మ ప్రపంచస్థాయిలో ఆదరణకు నోచుకుంటున్నాయి. కొండపల్లి చరిత్రకు శాశ్వత చిరునామాగా నిలిచాయి!.












కామెంట్లు (0)