న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుండి ప్రారంభం కానున్నాయి. మూడువారాల పాటు సమావేశాలు కొనసాగనున్నాయని సంబంధిత వర్గాలు బుధవారం ప్రకటించాయి. అయితే పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ తుది నిర్ణయం ప్రకటించాల్సి వుందని వెల్లడించాయి. సాధారణంగా వర్షాకాల, శీతాకాల సమావేశాలు నాలుగువారాల పాటు సాగుతాయి. సుమారు 20 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో తక్కువ వ్యవధిలో సమావేశాలు జరిగిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్, కేరళం, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పశ్చిమబెంగాల్, అస్సాం పుదుచ్చేరిల్లో బిజెపి అధికారం చేపట్టగా, కేరళంలో యుడిఎఫ్, తమిళనాడులో టివికె అధికారంలోకి వచ్చాయి. అదే సమయంలో టిఎంసి, శివసేన (యుబిటి)ల్లో అంతర్గత తిరుగుబాటు వ్యవహారాలు కూడా చర్చకు రానున్నాయి. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరుతూ 20 మంది టిఎంసి, ఆరుగురు శివసేన (యుబిటి) ఎంపిలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికై, తిరిగి ఎన్నికైన ఎంపిలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
జులై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ..!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)