ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ర్టంలో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)-యుజి నిర్వహణ, సమన్వయం, పర్వవేక్షణ కోసం ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తాను రాష్ట్ర నోడల్ అధికారిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. రాష్ర్టం నుంచి ఈ పరీక్షకు 65,790 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా స్థాయి సమన్వయాధికారుల కోసం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెన్ అండ్ పేపర్ (ఓఎంఆర్)విధానంలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్రంలోని 27 నగరాల్లో 185 పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) ఏర్పాటు చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు, అధికారులు, పరీక్షకేంద్రాల మధ్య సమన్వయం కోసం రాష్ర్టస్తాయి కంట్రోల్ రూమ్ ను మంగళగిరిలోని ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత జిల్లా రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం కోసం 16 మంది ప్రభుత్వ డిగ్రీ, 28 మంది పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లను సమన్వయాధికారులుగా నియమించింది. ఈ అధికారులు శనివారం సంబంధిత జిల్లా రెవెన్యూ అధికారులకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సందేహాలు కోసం 7893523455 నెంబర్ను సంప్రదించాలని పేర్కొంది.








కామెంట్లు (0)