సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విజయవాడలో వైసిపి నిరాహార దీక్షా శిబిరంపై బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టిడిపి కార్యకర్తల దాడి గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిఎస్సిలో అవినీతిపై వైసిపి నేతలు, కార్యకర్తలు విజయవాడలో ఆందోళన చేస్తుండగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు దాడి చేసి దీక్షా శిబిరాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ఇలాంటి దాడులకు పూనుకోవడం పాలనా వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే హక్కును హరిస్తూ, టిడిపి దౌర్జన్యం చేయడం తగదని, పోలీసుల సమక్షంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నా, నివారించకపోగా వైసిపి నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇటువంటి దాడులను నివారించాల్సిన ప్రభుత్వం, టిడిపి అధిష్టానం సమర్ధించుకునే రీతిలో వ్యవహరించడం సరికాదని తెలిపారు. దాడి చేసిన బోండా ఉమామహేశ్వరరావు, టిడిపి నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇటువంటి దాడులు జరగకుండా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.








కామెంట్లు (0)