ప్రజాశక్తి-అమరావతి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్ పర్సన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని వ్యతిరేకిస్తున్నట్లు సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ప్రజలకు దగ్గరగా వుండే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, యంపిటీసీలు, జెడ్పిటీసీలకు ప్రాధాన్యత వుండదని, దిష్టి బొమ్మలుగా మిగిలి పోతారని అన్నారు. అధికారం కేంద్రీకృతమై పోతుందని, 73, 74 రాజ్యాంగ సవరణ స్పూర్తి దెబ్బతింటుందని అన్నారు. ప్రజాస్వామ్యం బలహీన పడుతుందని హెచ్చరించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులకు 34శాతం రిజర్వేషన్లు ఖాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఇది అమల్లోకి రావాలంటే రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని సవరించాలని సూచించారు. మిశ్రా కమిషన్ సైతం దీన్ని ఎత్తిచూపిందని అన్నారు. ఇందుకు పార్లమెంటు చట్టం చేయాలని సూచించారు. కేంద్ర ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపిలు ఈ రాజ్యాంగ సవరణ జరిగేటట్లు చూడాలని, ఆ పని చేయకుండా ఇక్కడ ఒక తీర్మానం చేయగానే అది అమల్లోకి రాదని అన్నారు. న్యాయపరమైన ఆటంకాలు ఎదుర్కొంటుందని ప్రభుత్వానికి కూడా తెలుసని అన్నారు. వైసిపి, టిడిపిలు దీని చుట్టూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని అన్నారు. ఆరోపణలతో సరిపెట్టుకోకుండా రెండు పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయించి, తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అన్నారు. తెలిసీ బిసిలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల పేరుతో హడావుడిగా రిజర్వేషన్ తెచ్చి అమలు చేయక పోతే ప్రభుత్వ చిత్తశుద్దినే ప్రశ్నించాల్సి వస్తుందని అన్నారు. 2026 జనగణనతోపాటు కులగణన కూడా జరుగుతోందని, ఇది పూర్తయితే సామాజికపరమైన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఈలోగా మిశ్రా కమిషన్ సిఫార్సులననుసరించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. అలా కాకుండా కేలవం ప్రచారంకోసం చేస్తే అది బిసిలకు అన్యాయం చేయడమే అవుతుందని హెచ్చరించారు.
స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలొద్దు : వి.శ్రీనివాసరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 05:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)