- ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిదిమంది మృతి
- మరో ఎనిమిదిమంది గల్లంతు
- 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
తిరువనంతపురం : కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిదిమంది గల్లంతయ్యారు. మలప్పురంలో ఉప్పొంగిన వాగులో పడి 3, 4 ఏళ్ల చిన్నారులు అబ్దుల్ ముహైని, ఆడమ్ ఐమాన్ మరణించారు. వకతనంకు చెందిన 11 ఏళ్ల మిలన్ కె. షిను 'జల్ జీవన్ మిషన్' ప్రాజెక్ట్ కోసం తవ్విన నీటితో నిండిన గుంతలో పడి చనిపోయాడు. కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి నలుగురు మరణించారు. వయనాడ్లో విద్యుద్ఘాతంతో మరొకరు చనిపోయారు. సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు, నదిలో పడి మరో ఇద్దరు గల్లంతయ్యారు. కొజికోడ్ తీరప్రాంతంలో బోటు చిక్కుకుపోవడంతో 17మంది జాలర్లను రక్షించారు. ముఖ్యమంత్రి వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమై చేపట్టాల్సిన సహాయక చర్యలను సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా వుండాల్సిన అవసరముందంటూ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ పేర్కొన్నారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించాలని కోరారు.
తొమ్మిది జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండి) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24గంటల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. మిగిలిన ఐదు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే భారీ వర్షాలు పడే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65శిబిరాలు ఏర్పాటు చేశారు. పల్లపు ప్రాంతాలు మునిగిపోవడంతో 1500మందికి పైగా బాధితులను శిబిరాలకు తరలించారు. భారీ వర్షాలు పడుతుండడంతో ఇడుక్కి రిజర్వాయర్లో నీటి మట్టం బాగా పెరిగింది. పలుచోట్ల రిజర్వాయర్లలో ఇదే పరిస్తితి నెలకొనడంతో అధికార యంత్రాంగం వరద హెచ్చరికలు జారీ చేసింది.








కామెంట్లు (0)