న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపుల కేసుకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. ఆయనకు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేసింది. మాజీ ప్రధాని సహా ఇతరులకు క్లీన్ చిట్ ఇస్తూ సిబిఐ ఇచ్చిన ముగింపు నివేదికను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం ఆమోదించింది. సిబిఐ ముగింపు నివేదికను ట్రయల్ కోరుట తిరస్కరించేందుకు ఎటువంటి కారణం లేదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
బొగ్గు కుంభకోణానికి సంబంధించి 2005లో ఒడిశాలోని తలబిర -2 బొగ్గు బ్లాక్ను కేటాయించడంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వ్యాపారవేత్త కుమారమంగళమ్ బిర్లా, మాజీ బొగ్గు కార్యదర్శి పి.సి.పరాఖ్ సహా మరో ముగ్గురికి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. తన వంటి ప్రభుత్వ అధికారులపై విచారణ జరపడానికి తప్పనిసరిగా ఉండాల్సిన అనుమతి లేకపోవడాన్ని సింగ్ ప్రశ్నించారు, అలాగే బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి తాను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి నేరపూరిత చర్య లేదని స్పష్టం చేశారు. 2024 డిసెంబర్లో మన్మోహన్ సింగ్ మరణించారు. కానీ ఆ కేసు కొనసాగుతూ వస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ.. కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది.








కామెంట్లు (0)