ముంబయి : మహిళా హక్కుల కార్యకర్త, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) మహారాష్ట్ర మాజీ కార్యదర్శి సోన్యా గిల్ (70) మంగళవారం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం సాయంత్రం వాకింగ్కు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆమె భర్త, ప్రముఖ జర్నలిస్టు పి. సాయినాథ్ ఆ సమయంలో ఆమెతోనే ఉన్నారు. సోన్యా గిల్ ‘పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా’ (పారి) సహ వ్యవస్థాపకురాలు, ట్రస్టీగా కూడా పనిచేశారు.
ఆమె మృతికి పారి నివాళులర్పించింది. ఆమె ధైర్యం, అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. మహిళా కార్యకర్తలకు సైద్ధాంతిక, సంస్థాగత శిక్షణ అందించడంపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపేవారని ఐద్వా పేర్కొంది. తమ ప్రియమైన సహచరి సోన్యా గిల్ ఇక లేరన్న విషయం తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని, ఇది నమ్మశక్యంగా లేదని ఐద్వా ఉపాధ్యక్షురాలు మరియం ధావలే పేర్కొన్నారు. సోన్యా గిల్తో తనకు 32 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. ‘‘సోన్యా గొప్ప పోరాట యోధురాలు. అనారోగ్యంతోనూ ఎంతో ధైర్యంగా పోరాడారు. చివరి వరకు ఐద్వా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా తాను ఎదుర్కొన్న నొప్పి, ఇబ్బందుల గురించి ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఆమెతో ఎన్నో ఆనందకరమైన క్షణాలను పంచుకున్నాం. ఆమెను, ముఖ్యంగా ఆమె ఆత్మీయతను, నవ్వును మేమంతా ఎంతోగా మిస్ అవుతాం. ఐద్వాకు ఇది పూడ్చలేని, అపారమైన నష్టం’’ అని మరియం ధావలే పేర్కొన్నారు. ముంబయిలోని బీడీడీ చాల్స్, జిజామాతా నగర్, డెలిసెల్ రోడ్ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సోన్యా గిల్ ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళల హక్కులు, సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు, వారి సమస్యల పరిష్కారం కోసం ఆమె నిరంతరం కృషి చేశారు.







కామెంట్లు (0)