న్యూఢిల్లీ : ‘‘ఎవరు అక్రమాలకు పాల్పడినా నిలదీయాల్సిందే ’’ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనపై భద్రతా బలగాల క్రూరత్వంపై మంగళవారం విచారణ సందర్భంగా సిజెఐ ఈ హెచ్చరిక జారీ చేశారు. విచారణ సందర్భంగా.. ఎవరు అక్రమాలకు పాల్పడినా లేదా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా వారిని బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు. పోలీసుల క్రూరత్వంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. పూర్తి స్వతంత్ర విచారణ చేపట్టాలని, ఎవరు అక్రమాలకు పాల్పడినా చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. బాధ్యతను నిర్థారించకపోతే విచారణకు అర్థం ఉండదని సిజెఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.
విద్యుత్ లాఠీలను వినియోగించడాన్ని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై నిష్పాక్షికమైన, పారదర్శకమైన, స్వతంత్ర విచారణ చేపట్టాలని సిజెఐ ఆదేశించారు. కేవలం ఆందోళన చేసినంత మాత్రాన లాఠీచార్జ్ను సమర్థించలేమని అన్నారు.
జులై 20న సిజెపి నిర్వహించిన చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నిరసనకారులపై క్రూరంగా దాడి చేపట్టడాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఖండించిన సంగతి తెలిసిందే. ప్రదర్శనల సమయంలో నిరసనకారులు, పోలీసు సిబ్బందికి జరిగిన గాయాల పట్ల తాము కూడా అంతే ఆందోళన చెందుతున్నామని సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే, ప్రజాస్వామ్యంలో నిరసనకారులు, పోలీసు సిబ్బంది "స్వీయ క్రమశిక్షణ" పాటించడం అత్యంత కీలకమని ఉద్ఘాటించింది. ‘‘ ఆందోళనలను ప్రతికూలంగా తీసుకోవద్దు. ఏవైనా దురాగతాలు జరిగి ఉంటే, వాటిని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయవచ్చు. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన ప్రశ్న కాదు, ఇది అఖిల భారత సమస్య. ఆందోళన చేపట్టినందున లాఠీచార్జి చేశామన్నట్లు ఉండకూడదు. అలాగే ఈ నిరసనలలో హింస చోటుచేసుకుంటుందన్నట్లుగా కూడా ఉండకూడదు," అని సిజెఐ పునరుద్ఘాటించారు. అలాగే బీహార్లో విద్యార్థి నిరసనకారులపై ఏకే-47 రైఫిల్ను ఉపయోగించిన విషయాన్ని కూడా ప్రస్తావించగా, దేశవ్యాప్తంగా నిరసనలపై మార్గదర్శకాలను పరిశీలిస్తామని సిజెఐ తెలిపారు.








కామెంట్లు (0)