న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలకు ఎందుకు రావడం లేదని సిపిఎం ఎంపి వి. శివదాసన్ శుక్రవారం ప్రధాని మోడీని నిలదీశారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ప్రధాని, సభలో జరిగే చర్చల్లో పాల్గొనడానికి మాత్రం ‘‘సిద్ధంగా లేరని’’ విమర్శించారు. ప్రధాని మోడీ అర్ధరాత్రి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు కానీ.. పార్లమెంటుకు మాత్రం రావడం లేదని అన్నారు. సభలో బిల్లులు, పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోందని, ఆయన ఎందుకు పార్లమెంటుకు రావడం లేదు, చర్చలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు, చర్చల్లో పాల్గొనేందుకు ఎందుకు సిద్ధంగా లేరని ప్రధాని మోడీని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్చల్లో పాల్గొని, పార్లమెంటులో సరైన సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేసున్నాయని అన్నారు.
ప్రభుత్వ పరీక్షలు (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు–2026 పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోడీ గురువారం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత పెంపు, వేగవంతమైన ప్రక్రియలు, రాష్ట్రాల సూచనలకు ప్రాధాన్యం కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వం నిరంతరం చేపడుతోందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య దశాబ్దాలుగా కేంద్రం, రాష్ట్రాలను వేధిస్తోందని, ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.








కామెంట్లు (0)