ప్రజాశక్తి-అచ్చుతాపురం :రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాన్ని ₹26,000కు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్, కార్యదర్శి ఆర్. రాము డిమాండ్ చేశారు. మండల సిఐటియు సమన్వయ కమిటీ సమావేశం మండల కన్వీనర్ కే.సోమునాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చట్టప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉన్నప్పటికీ, 2007 నుండి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టిడిపి, వైసిపి మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు కార్మికుల వేతనాలను పెంచలేదని వారు విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ నేటికీ అమలు చేయడం లేదని, అదే సమయంలో కర్ణాటక, తెలంగాణ, నోయిడా వంటి ప్రాంతాల్లో వేతనాలు పెంచారని వారు గుర్తు చేశారు. మన ప్రాంతంలోని బ్రాండిక్స్, ఫార్మా, ఫెర్రో అల్లాయిస్ వంటి పరిశ్రమల కార్మికులతో పాటు ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, వివోఏ, వీఆర్ఏ, పంచాయతీ, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచేంతవరకు పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈజెడ్ కార్మికులు ఎల్. నర్సింగరావు, సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు నారాయణమ్మ, ఆశా వర్కర్ల నాయకురాళ్లు మంగమ్మ, దుర్గ, మిడ్డే మిల్స్ నాయకురాలు సత్యవతి, వివోఏ నాయకురాలు దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలి : సిఐటియు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 05, 2026, 11:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)