నడవలేని కాళ్లకు మళ్లీ ప్రాణం పోశారు..
నిరుపేదలకు కొత్త జీవితాన్ని అందించిన అపోలో జిల్లా డాక్టర్లు
అపోలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి (చిత్తూరు) : నడవలేని స్థితికి చేరుకున్న ఇద్దరు నిరుపేద రోగులకు అపోలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ క్లిష్టమైన ఆపరేషన్లను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించి వారికి మళ్లీ స్వయంగా నడిచే అవకాశాన్ని కల్పించారు. యాదమర్రి మండలం చిన్నంపల్లె గ్రామానికి చెందిన ఎం. చల్లయ్య (76) తీవ్ర మోకాళ్ల నొప్పితో చాలా కాలంగా ఇబ్బందులుపడుతున్నారు. అపోలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు పూర్తి మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు నుంచే ఆయన నెమ్మదిగా నడవడం ప్రారంభించడం విశేషం. అనంతరం ఫిజియోథెరపీ నిపుణుల పర్యవేక్షణలో కోలుకుని ఆనందంగా ఇంటికి వెళ్లారు. అలాగే పాకాల మండలం పెద్దరామాపురం గ్రామానికి చెందిన పి.సునీత (47) కూడా చాలా కాలంగా తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. తిరుపతి, బెంగళూరులోని పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నప్పటికీ, మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అపోలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతమైన మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని వార్తా పత్రికల్లో చదివి ఆసుపత్రికి వచ్చారు. వైద్యుల సలహా మేరకు ఆమెకు కూడా విజయవంతంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుని సంతోషంగా ఇంటికి వెళ్తున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ శస్త్రచికిత్సలను ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ హరిబాబు, డాక్టర్ అశోక్, డాక్టర్ ఆశిష్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ మోగలీష్, డాక్టర్ అఖిల్ బృందం, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రాధా నేతృత్వంలోని బృందం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. లక్షల రూపాయల వ్యయంతో జరిగే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం పట్ల రోగుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అపోలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలు పేద ప్రజలకు గొప్ప వరంగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగనాథ్ బి.జి. మాట్లాడుతూ …. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో ఇలాంటి విజయవంతమైన శస్త్రచికిత్సలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అత్యాధునిక వైద్య సేవలను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని తెలిపారు.










కామెంట్లు (0)