ప్రజాశక్తి-కాకినాడ :
కాకినాడ నగరంలోని గాంధీనగర్ పార్కులో ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి గాంధీనగర్ పార్కును సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
పార్కు పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కమిషనర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్కుకు వచ్చే వాకర్లు జిమ్కు సంబంధించిన కొన్ని పరికరాలు పనిచేయడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్, వెంటనే ఆ పరికరాలకు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే పార్కులో కొంతమంది బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకువచ్చి వీధి కుక్కలకు ఆహారం వేస్తున్నట్లు గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు. ఇలా చేయడం వల్ల పార్కు పరిసరాల్లో కుక్కల సంఖ్య పెరిగి వాకర్లు, సందర్శకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పార్కు పరిసరాల్లో సంచరిస్తున్న కుక్కలను డాగ్ స్క్వాడ్ ద్వారా పట్టుకుని యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రానికి తరలించే చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ గాంధీనగర్ పార్కును మరింత అభివృద్ధి చేసి పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు నగర పాలక సంస్థ కట్టుబడి ఉందన్నారు. పార్కుకు వచ్చే ప్రజలు కూడా పరిశుభ్రతను కాపాడుతూ సహకరించాలని కోరారు.
ఈ తనిఖీలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీచరణ్, డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్తిబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)