విజయవాడ : పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్ తో సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన ఛలో డిస్నీల్యాండ్’ కార్యక్రమం విజయవంతమయ్యింది. పేదలు, లబ్ధిదారులు, సిపిఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆందోళనకారులంతా ర్యాలీగా వెళ్లి డిస్నీల్యాండ్ భూముల్లో పేదలు, కార్యకర్తలు జెండాలను పాతిపెట్టారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ,నగర నేతలు బోయి సత్యబాబు, బి రమణ రావు, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ .... కార్పొరేషన్ ఎన్నికలలోపే అర్హులైన పేదలందరికీ రెండు సెంట్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న పేదల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా స్థలం కేటాయించాలన్నారు. పేదల నివాస హక్కును ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. స్థలాల కేటాయింపులో రాజకీయ జోక్యం, వివక్షకు తావులేకుండా అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రభుత్వ భూములను పేదల గృహ అవసరాలకు వినియోగించాలని కోరారు. ఇళ్ల స్థలం లేని పేద కుటుంబాలపై ప్రత్యేక సర్వే నిర్వహించి జాబితా రూపొందించాలన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలతో కూడిన నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలన్నారు. పేదల సమస్యలను ఎన్నికల హామీలకే పరిమితం చేయకుండా వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులతో చర్చించి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.









కామెంట్లు (0)