షాపింగ్ మాల్ ఉద్యోగుల వేతనాల పెంపు కోసం సిఐటియు పిలుపు
ఎన్టీఆర్ జిల్లా,మైలవరం : షాపింగ్ మాల్స్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కనీస వేతనాలను తక్షణమే సవరించి అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. బుధవారం మైలవరం టౌన్ లోని అన్ని షాప్స్ మాల్స్ లో కరపత్రాల పంపిణీ చేపట్టారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో షాప్ మాల్ ఉద్యోగులకు 2007లో నిర్ణయించిన కనీస వేతనాలే ఇప్పటికీ అమల్లో ఉండడం దారుణమన్నారు. పెరిగిన ధరలు జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు సవరించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం మాల్స్ షాపుల్లో ఉద్యోగులు రోజుకు 12 గంటల వరకు శ్రమిస్తున్నప్పటికీ చట్టబద్ధమైన వేతనాలు ఓవర్టైమ్ వారాంతపు సెలవులు ఇతర కార్మిక హక్కులు అమలు కావడం లేదన్నారు. కార్మిక చట్టాలను యాజమాన్యాలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2007 తరువాత 2012, 2017, 2022 సంవత్సరాల్లో వేతన సవరణలు జరగాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో వేలాది మంది షాప్ ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను వెంటనే సవరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. షాప్ ఉద్యోగులకు 8 గంటల పని వారానికి ఒక రోజు చెల్లింపు సెలవు ఓవర్టైమ్కు రెట్టింపు వేతనం ఈఎస్ఐ పీఎఫ్ ఉద్యోగ భద్రత వంటి చట్టబద్ధ హక్కులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 30న విజయవాడ కలెక్టరేట్ వద్ద నిర్వహించే సిఐటియు ధర్నాను షాప్ మాల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సిహెచ్ సుధాకర్ పిలుపునిచ్చారు.








కామెంట్లు (0)