మలుపుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలంటున్న యాత్రికులు...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కోటప్పకొండ ఘాట్ రోడ్డులో మంగళవారం కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు, యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు లోని ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మలుపుల వద్ద ఇనుప రాడ్లతో భద్రతా కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న రక్షణ గోడలను పటిష్టం చేయాలని కోరుతున్నారు. గోడలు బలహీనంగా ఉంటే అదుపు తప్పిన వాహనాలు లోయలోకి పడిపోయే ప్రమాదం ఉందని యాత్రికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకర మలుపులను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కోటప్పకొండకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








కామెంట్లు (0)