- విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా భారీ ర్యాలీ
ప్రజాశక్తి – గరుగుబిల్లి: విద్యుత్ ప్రమాదాల నివారణ, ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్. రామునాయుడు ఆధ్వర్యంలో ఏఈఈ, జేఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొని గ్రామంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను పాటించాలని అధికారులు సూచించారు. విద్యుత్ తీగలు తెగిపడినప్పుడు వాటికి దూరంగా ఉండాలని, తడిచేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, స్తంభాలను గుర్తించిన వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే పిల్లలు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లకు సమీపంలో ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ భద్రతపై ప్రతి కుటుంబం అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ భద్రతకు సంబంధించిన నినాదాలతో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






కామెంట్లు (0)