రోడ్డు సౌకర్యం కల్పించాలని జరడ పంచాయతీ ప్రజల డిమాండ్
ప్రజాశక్తి - కురుపాం (మన్యం) : రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ... జరడ పంచాయతీ పరిధిలోని గిరిజనులు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తమ గ్రామాలకు రహదారి లేక ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో వినూత్న రీతిలో నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు. జరడ, గెడ్డగూడ, ములుగూడ, గుమ్మిడిగూడ, పొడిదాం, పట్టాయిగెడ్డ, కంబమానుగూడ గ్రామాలకు సరైన రహదారి లేక వర్షాకాలంలో రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు. అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు, గర్భిణులు, వృద్ధులు అత్యవసరంగా ప్రయాణించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి కోసం గతంలో పీఓ, కలెక్టర్కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఇంతవరకు స్పందన లేదని గిరిజనులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ గ్రామాలకు రహదారి మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.







కామెంట్లు (0)