మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ప్రజాశక్తి-టంగుటూరు: పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం, తూర్పు నాయుడుపాలెం గ్రామంలోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. అక్కడ ఉన్న ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 1,56,477 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. పల్స్ పోలియో అనేది ఒక ప్రజా ఉద్యమంలా సాగాలని ఆకాంక్షించారు ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క చిన్నారి మిస్ అవ్వకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలియో చుక్కల ప్రాధాన్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఒకవేళ ఆదివారం పోలియో కేంద్రానికి రాలేకపోయిన వారి కోసం, రాబోయే రెండు రోజుల్లో సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖాధికారి టి. వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రముఖులు, తల్లులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)