ఒంగోలు (ప్రకాశం) : నీట్ అక్రమాలపై ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. నీట్తో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్లో భాగంగా ... ఒంగోలులో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పట్టణంలోని పలు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులు బంద్కు మద్దతు తెలపాలని కోరుతూ పాఠశాలలను మూసివేయించి, విద్యార్థులను బయటకు పంపించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నీట్తో పాటు జాతీయ ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా రోడ్డు పక్కకు ఈడ్చి పడేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరును విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్. రాజశేఖర్, జేఏసీ నాయకులు బెజవాడ జగదీష్, ఏఐవైఎఫ్ నాయకులు కరుణానిధి తదితర విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా రోడ్డు పక్కకు ఈడ్చి వేశారు. పోలీసుల బలప్రయోగాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ, శాంతియుత నిరసనను అణచివేయడం సరికాదని ధ్వజమెత్తారు.
నీట్ అక్రమాలపై ఆందోళన - ఈడ్చిపడేసిన పోలీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 02:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)