బైక్ ర్యాలీలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు హెచ్చరిక
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ : అడవివరం సింహాచలం దేవస్థానం కొండపై ఏర్పాటు చేయబోతున్న అదానీ గూగుల్ డేటా సెంటర్కు ఈ ప్రాంత పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాలను తాకట్టు పెట్టొద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు హెచ్చరిక చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు టిఐసి పాయింట్ జంక్షన్లో గూగుల్ డేటా సెంటర్ వ్యతిరేక సభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం స్థానిక కమిటీ ఆధ్వర్యంలో ఓల్డ్ డెయిరీ ఫారం వద్ద బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీని జగ్గునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వం జనావాసాల మధ్య గూగుల్ అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు పూనుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. విశాఖపట్నాన్ని అదానీ విశాఖలా తయారు చేస్తున్నారని విమర్శించారు. 2019లో ఇదే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఋషికొండ వద్ద 400 ఎకరాలు అదానీ సంస్థకు డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో భూమి కేటాయించినా నేటికి పసులు ప్రారంభం కాలేదన్నారు. పేదలు నివాసముంటున్న ఆరిలోవ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న కుట్ర ఏమిటిని ప్రశ్నించారు. ఈ ప్రాంతం పర్యావరణంతో పచ్చగా ఉన్న ప్రాంతం. 275 సర్వేనెంబరులో పేదల ఇళ్ళకు పట్టాలు ఇవ్వని చంద్రబాబు ఆఘమేఘాలమీద అదానీ డేటా సెంటర్కు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. ముడసర్లోవ రిజర్వాయర్ ద్వారా లక్ష మందికి త్రాగునీరు అందుతుందని, డేటా సెంటర్ వేడికి ఈ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయి నీళ్ళు లేకుండా పోతాయన్నారు. ఈ డేటా సెంటర్ అడవివరంలో పెట్టడం వలన ప్రజలకు అనేక రూపాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ డేటా సెంటర్ను జనావాసాలు లేని ప్రాంతంలో ఏర్పాటుకు పూసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్దఎత్తున ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ డేటా సెంటర్ తరలించాలని కోరుతూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రజలు, కాలనీ సంఘాలు, రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం రవీంద్రనగర్ నుండి గాంధీనగర్, బాలాజీనగర్, తోటగరువు, టిఐసి పాయింట్, లీలాసుందర్నగర్, దుర్గానగర్, ఆరిలోవ చివరి బస్ స్టాప్ నుండి చినగదిలి, పెదగదిలి మీదుగా హనుమంతువాక చేరుకొని ముగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె. ఎస్.వి. కుమార్, జోన్ కార్యదర్శి వి. కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు వి.నరేంద్రకుమార్, డి. అప్పలరాజు, జోన్ కమిటీ సభ్యులు పి.శంకరరావు, కె.కుమారి, ఎం చంటి, స్థానిక నాయకులు నాగరాజు, వి. భూలోకరావు, మోహన్రావు, జె.ఆర్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)