బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జపాన్ భూకంపంలో 13 మంది మృతి

14 గంటల క్రితం

japan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 08:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రధాని సనాయ్ తకైచి

- 100 మందికిపైగా గాయాలు

టోక్యో: జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపం క్యూషులోని కుమామోటో ప్రాంతాన్ని మంగళవారం 7.1 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి విపత్తులో 13 మంది మృతి చెందినట్లు జపాన్ ప్రధాని సనాయ్ తకైచి వెల్లడించారు. మరో 100 మందికిపైగా గాయపడగా, భవనాలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం అనంతరం జపాన్ వాతావరణ సంస్థ తాత్కాలికంగా సునామీ హెచ్చరిక జారీ చేసింది. అయితే పరిస్థితిని సమీక్షించిన అనంతరం రెండు గంటల్లోనే ఆ హెచ్చరికను ఉపసంహరించింది. ప్రధాని సనాయ్ తకైచి ఎక్స్ వేదికగా స్పందిస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, నష్టాన్ని అంచనా వేయడానికి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూకంపం కారణంగా పలు భవనాలు కూలిపోగా, అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. దెబ్బతిన్న ఓ షాపింగ్ మాల్‌లో పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల తొలగింపు, గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రహదారులు, వంతెనలు దెబ్బతినడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రజలు మంటలు, పగిలిన గాజు ముక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని తకైచి సూచించారు.


గత 15 సంవత్సరాల్లో జపాన్‌ను వణికించిన ప్రధాన భూకంపాలు ఇవే:

  • మార్చి 11, 2011: ఈశాన్య జపాన్‌లో 9.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం, అనంతరం వచ్చిన సునామీ కారణంగా దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు వల్ల ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో మెల్ట్‌డౌన్ సంభవించి, చెర్నోబిల్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదంగా నమోదైంది.

  • ఏప్రిల్ 16, 2016: కుమామోటో ప్రాంతాన్ని 7.3 తీవ్రతతో భూకంపం తాకింది. ఈ ఘటనలో 270 మందికి పైగా మరణించారు. భూకంపం అనంతరం సంభవించిన కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు కూడా ప్రాణనష్టాన్ని పెంచాయి.

  • జూన్ 18, 2018: జపాన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఒసాకాలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. పారిశ్రామిక ప్రాంతాల్లోని పలు కర్మాగారాల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.

  • సెప్టెంబర్ 6, 2018: ఉత్తర ద్వీపం హొక్కైడోలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికి పైగా మరణించారు. భారీ కొండచరియలు విరిగిపడగా, దాదాపు 53 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

  • ఫిబ్రవరి 13, 2021: ఫుకుషిమా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడగా, గ్రేటర్ టోక్యోలో విస్తృతంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి.

  • మార్చి 16, 2022: ఫుకుషిమా తీరాన్ని 7.4 తీవ్రతతో మరోసారి భూకంపం కుదిపేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. 2011 విపత్తు జ్ఞాపకాలను ఈ భూకంపం మళ్లీ గుర్తు చేసింది.

  • జనవరి 1, 2024: నూతన సంవత్సర రోజున నోటో ద్వీపకల్పాన్ని 7.6 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఈ ఘటనలో 300 మందికి పైగా మరణించారు.

  • ఆగస్టు 8, 2024: దక్షిణ మియాజాకి తీరంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో జపాన్ అధికారులు మెగా భూకంపం సంభవించే ప్రమాదం సాధారణం కంటే ఎక్కువగా ఉందని తొలిసారిగా హెచ్చరిక జారీ చేశారు. అయితే, వారం రోజుల తర్వాత ఆ హెచ్చరికను ఉపసంహరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్