అమెరికా : లంచం కేసులో .... అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ పై ఉన్న నేరాభియోగాలను అమెరికా కోర్టు కొట్టివేసింది. రెండేళ్ల క్రితం అమెరికాలో అదానీపై కేసు దాఖలైన సంగతి తెలిసిందే. న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ గ్రీన్ సిఇఒ వినీత్ జైన్ పై ఉన్న కేసులను డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. న్యాయవాది నికోలస్ గారౌఫిస్ ఈ తీర్పును వెలువరించారు. ఈ కేసును డిస్మిస్ చేయడంతో.. అదానీపై నేరాభియోగాలను శాశ్వతంగా కొట్టివేసినట్లు అవుతుంది. ఇదే రకమైన నేరాభియోగాలను మళ్లీ నమోదు చేయకూడదు.
2024 లో కేసు నమోదు ....
2024 నవంబర్లో గౌతమ్ అదానీపై క్రిమినల్ కేసు నమోదయింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ల డాలర్ల లంచం ఇచ్చినట్లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 బిలియన్ల డాలర్లు ఆర్జించాలని అదానీ గ్రూపు భావించినట్లు ఆరోపణలున్నాయి. అమెరికా మార్కెట్లో బాండ్లు జారీ చేయడం ద్వారా సుమారు మూడు బిలియన్ల డాలర్లు ఆర్జించారని, దీంట్లో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కానీ అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. నిరాధార ఆరోపణలు అని పేర్కొన్నది. చట్టాలు, నిబంధల ప్రకారమే వ్యవహరించినట్లు అదానీ గ్రూపు తెలిపింది.
బహుళ ప్రయోజనాలే మా కమిట్ మెంట్ : అదానీ
అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల గౌతమ్ అదానీ స్పందిస్తూ ... కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. హుందాగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, న్యాయ ప్రక్రియపై గాఢమైన గౌరవం ఉందన్నారు. ఈ సంకట కాలంలో సత్యంపై నమ్మకం, చట్టంపై విశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు. ఎక్స్ అకౌంట్లో గౌతమ్ అదానీ స్పందించారు. తమపై నమ్మకంతో ఉన్నవారికి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఏదేమైనా తమ పని తాము చేసుకుపోతామని, దేశ నిర్మాణం కోసం శ్రమిస్తామని, విలువలను క్రియేట్ చేస్తామని, బహుళ ప్రయోజనాల కోసం పనిచేస్తామని, అదే తమ కమిట్మెంట్ అన్నారు.








కామెంట్లు (0)