శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

US - యుఎస్ మధ్యంతర ఎన్నికలు : ప్రారంభమైన ముందస్తు ఓటింగ్

54 నిమిషాల క్రితం

US Midterm Elections: Early voting begins.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 02:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రగులుతున్న నియోజకవర్గాల పునర్విభజన వివాదం


వాషింగ్టన్ (వెబ్ డెస్క్) : అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రత్యక్ష ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు, పెంపుదల ప్రతికార పన్నుల నిర్ణయాల మధ్య క్షీణించిన తన ప్రజాదరణను తిరిగి పుంజుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటిన జీవన వ్యయం, యుద్ధంలోకి అమెరికాను నెట్టడంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో ప్రధాన సవాళ్లుగా మారాయి.


వర్జీనియాలో మొదటి అడుగు :

ముందస్తు ఓటింగ్ (ఎర్లీ ఓటింగ్) ప్రక్రియ వర్జీనియాలో మొదలైంది. ఐదాహో, మిన్నెసోటా, సౌత్ డకోటా రాష్ట్రాల్లోని స్థానిక ఎన్నికల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు నేరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 3న అధికారికంగా పోలింగ్ జరగనుంది. ఓటర్లకు ఈ విధమైన ముందస్తు ఓటింగ్ సదుపాయం కల్పించడం అమెరికా ఎన్నికల విధానంలో ఒక భాగం.


ఈ ఎన్నికల ఫలితాలు యుఎస్ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సేనేట్‌లలో రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా లేదా డెమొక్రాట్లు అధికారాన్ని హస్తగతం చేసుకుంటారా అనేదాన్ని తేల్చనున్నాయి. అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ కోల్పోతే, అది ట్రంప్ మిగిలిన రెండేళ్ల పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా యుద్ధ నిర్ణయాలు, కీలక చట్టాల తయారీలో ప్రతిపక్ష డెమొక్రాట్ల ప్రభావం పెరుగుతుంది.


ప్రచారంలో నియోజకవర్గాల పునర్విభజన వివాదం :

పెట్రోల్ ధరల పెంపు, నిత్యావసరాల ధరల భారం, ఇరాన్ యుద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న ఆందోళనలు, ట్రంప్ వలస వ్యతిరేక విధానాలతో పాటు ఈసారి 'నియోజకవర్గాల పునర్విభజన' (గెరీమాండరింగ్) ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


సాధారణంగా అమెరికా చట్టాల ప్రకారం... ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అయితే ఈసారి దానికి భిన్నంగా ముందే ఈ ప్రక్రియను చేపట్టడం వివాదానికి దారితీసింది. రిపబ్లికన్లు అధికారంలో ఉన్న టెక్సాస్‌లో మొదలైన ఈ సరిహద్దు మార్పుల వ్యూహానికి ప్రతిగా, డెమొక్రాట్ల పాలనలోని కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు కూడా తమ సరిహద్దులను మార్చాయి. 'ప్రొటెక్ట్ డెమోక్రసీ' అధ్యయనాల ప్రకారం, ఈ మార్పుల వల్ల దాదాపు 10 శాతం మంది ఓటర్లు (సుమారు 3.48 మిలియన్ల మంది) తమ పాత నియోజకవర్గాల పరిధి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.


మరోవైపు ఓటింగ్ విధానాలపై కేంద్ర నియంత్రణ సాధించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు తీవ్ర నిరసనకు దారితీశాయి. రాష్ట్రాల అధికారాలను, ఫెడరల్ స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ నిర్ణయాలను పలువురు వ్యతిరేకించారు. ముఖ్యంగా తపాలా (మెయిల్-ఇన్) ఓటింగ్‌ను నియంత్రించేందుకు ట్రంప్ వేసిన ప్లాన్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తిరస్కరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్