- అమెరికా దిగ్బంధనం ఎదుర్కోవాలి : క్యూబా అధ్యక్షుడు డియాజ్-కానెల్ పిలుపు
హవానా : అమెరికా విధించిన దిగ్బంధనంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్యూబాలో, అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ కీలక ఆర్థిక సంస్కరణలను ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా (పిసిసి) ఆమోదించిన ఈ మార్పులు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. గురువారం జరిగిన పిసిసి ప్లీనరీ సమావేశం అనంతరం ప్రసంగించిన డియాజ్-కానెల్, క్యూబా ప్రస్తుత పరిస్థితి “అత్యవసరమైన, అవసరమైన మార్పులను డిమాండ్ చేస్తుంది” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, పిసిసి పాత్ర “సంక్షోభాన్ని భరించడం కాదు, మార్చాల్సిన వాటిని మార్చడం” అని ఆయన ఉద్ఘాటించారు.
సోషలిజం రక్షణకే...
అధ్యక్షుడు ప్రకటించిన ఈ ఆర్థిక సంస్కరణల ప్యాకేజీలో పర్యాటక రంగంలోకి “కొత్త భాగస్వాములను” ఆహ్వానించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యవసాయం, విదేశీ వాణిజ్యంలో సమూల మార్పులు తీసుకురావడం వంటి అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక మున్సిపాలిటీలకు మరింత స్వయంప్రతిపత్తిని కల్పించేందుకు నిర్ణయాల వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంస్కరణలు సోషలిజం రక్షణను బలోపేతం చేయడానికి, సామాజిక న్యాయాన్ని విస్తరించడానికి, ఆర్థిక సంపదను సృష్టించి, దానిని సమానంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించినవని డియాజ్-కానెల్ పునరుద్ఘాటించారు. ఈ చర్యలను అత్యవసర ఆర్థిక, సామాజిక ఎజెండాగా అభివర్ణించిన ఆయన, కొన్ని నిర్ణయాలపై ఏకాభిప్రాయం లేకపోయినా, అవి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
క్యూబా ప్రస్తుతం తీవ్ర ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది, జనవరి నుండి అమెరికా విధించిన చమురు దిగ్బంధనం పరిస్థితిని మరింత దిగజార్చింది. మే 1న, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా ప్రభుత్వంతో వ్యాపారం చేసే కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసిన సంగతి తెలిసిందే. క్యూబా ప్రభుత్వం ఈ సంస్కరణలను వాషింగ్టన్తో చర్చలకు ముడిపెట్టనప్పటికీ, అమెరికా పరిపాలన ఆర్థిక, రాజకీయ మార్పుల కోసం హవానాపై ఒత్తిడి తెస్తోంది. క్యూబా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. ఈ సంవత్సరం కనీసం 6.5 శాతం మేర వృద్ధి కుదించారు, ఇది 2020, 2025 మధ్య కాలంలో నమోదైన 15 శాతం కంటే అదనం. ప్రస్తుత తరుణంలో పరివర్తన, ఉత్పత్తిని పెంచడం, మరింత క్రమబద్ధీకరణ, ప్రజల అభిప్రాయాలను వినడం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం అవసరమని డియాజ్-కానెల్ తేల్చి చెప్పారు. ఈ సంస్కరణలకు నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ (ఎఎన్పిపి) ఆమోదం కావాలి. ఈ మేరకు ఎఎన్పిపి అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చింది.
చైనా, వియత్నాం నమూనాలే ఆదర్శం
క్యూబా ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరిచేందుకు చైనా, వియత్నాం దేశాలను సాధ్యమైన నమూనాలుగా డియాజ్-కానెల్ ప్రస్తావించారు. "ఆర్థిక సంపదను సృష్టించి, దాన్ని సమానంగా పంపిణీ చేయడం" లక్ష్యంగా ఈ సంస్కరణలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ప్రైవేట్ రంగానికి ఊతమివ్వడం, సంక్షోభం కారణంగా దేశం వీడిన లక్షలాది క్యూబన్ల నుంచి మరింత పెట్టుబడిని ఆకర్షించడం లక్ష్యంగా సంస్కరణలను వేగవంతం చేయాలని అన్నారు.








కామెంట్లు (0)