- సరిహద్దుపై సహా పలు అంశాలపై చర్చలు జరిపిన భారత్, చైనా
న్యూఢిల్లీ : వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) పొడవునా శాంతియుత పరిస్థితులను కొనసాగిస్తూ, దౌత్య, సైనిక చర్చలను బలోపేతం చేసుకునేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి. అపరిష్కృతంగా వున్న సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటూ, విశ్వాస పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తూ, సరిహద్దుల్లోని నదుల సమస్యలకు కూడా పరిష్కారాలను కనుగొనాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
సంప్రదింపులు, సమన్వయం కోసం యంత్రాంగాన్ని రూపొందించడంపై కసరత్తు (డబ్ల్యుఎంసిసి)కు శుక్రవారం భారత్, చైనాలు సమావేశమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్లోని పరిణామాలతో సహా ఎల్ఎసి పొడవునా గల పరిస్థితులను సమీక్షించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని భావించాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలంటే సరిహద్దుల్లో శాంతి భద్రతలను పరిరక్షించుకోవడం చాలా ముఖ్యమని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. భారత్ తరపున జాయింట్ సెక్రటరీ (తూర్పు ఆసియా) సుజిత్ ఘోష్ పాల్గొనగా, చైనా ప్రతినిధి బృందానికి సరిహద్దు వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హు యాంకి నేతృత్వం వహించారు. 2020లో గాల్వన్ లోయలో ఘర్షణలు, తూర్పు లడఖ్లో మిలటరీ మధ్య ఘర్షణలు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దాంతో సంబంధాలను పునర్నిర్మించుకునే ప్రయత్నంలో భాగంగా గతేడాది కాలంగా ఇరు దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.








కామెంట్లు (0)