మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాతావరణ మార్పులతో పెరుగుతున్న హిమానీనదాల ముప్పు

1 గంట క్రితం

glacial collapse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 11:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

భారత్‌, నేపాల్‌కు భవిష్యత్తులో తీవ్ర ప్రమాదం: చైనా శాస్త్రవేత్తల హెచ్చరిక

బీజింగ్‌: వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా టిబెట్‌ పీఠభూమిపై హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో భారత్‌, నేపాల్‌ సహా హిమాలయ ప్రాంత దేశాలకు హిమానీనదాల కారణంగా తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఆగస్టు 26న నేపాల్‌–చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఘోర విపత్తుతోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధం ఉందని పేర్కొన్నారు. టిబెటన్‌ పీఠభూమిపై చైనా పరిశోధకులు నిర్వహించిన తాజా హిమానీనదాల గణనలో వాటి మొత్తం విస్తీర్ణం సుమారు 39,000 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు వెల్లడైంది. గత ఆరు దశాబ్దాల్లో నిర్వహించిన రెండు అధ్యయనాల్లో ఈ విస్తీర్ణం వరుసగా 51,000, 44,000 చదరపు కిలోమీటర్లుగా నమోదైనట్లు పరిశోధకులు తెలిపారు. పీఠభూమి దక్షిణ ప్రాంతంలో హిమానీనదాల తిరోగమనం మరింత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గంగ్డిస్‌ పర్వతాలు (కైలాస పర్వతంతో కూడిన ట్రాన్స్‌హిమాలయన్‌ శ్రేణి), న్యాంచెన్‌ తంగ్లా పర్వతాలు, హిమాలయాలతో సహా పలు ప్రాంతాల్లో గత 60 ఏళ్లలో హిమానీనదాలు సుమారు 40 శాతం మేర కుంచించుకుపోయినట్లు చైనా పరిశోధకుడు కాంగ్‌ షిచాంగ్‌ తెలిపారు. మొత్తం టిబెటన్‌ పీఠభూమి పరిధిలో హిమానీనదాల విస్తీర్ణం సుమారు 24 శాతం తగ్గినట్లు చెప్పారు.


14 వేలకుపైగా హిమానీనద సరస్సులు

హిమానీనదాలు కరుగుతుండటంతో టిబెటన్‌ పీఠభూమిపై హిమానీనద సరస్సుల సంఖ్య, వాటి విస్తీర్ణం రెండూ గణనీయంగా పెరిగాయని కాంగ్‌ షిచాంగ్‌ తెలిపారు. ప్రస్తుతం క్వింగ్‌హై–టిబెట్‌ పీఠభూమిపై 1,100 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో 14,000కుపైగా హిమానీనద సరస్సులు ఉన్నాయని చెప్పారు. ఇవి వేగంగా విస్తరిస్తుండటంతో వాటికి సంబంధించిన విపత్తు ప్రమాదాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని వివరించారు. హిమానీనదాలు విరిగిపడటం, సరస్సులు పొంగిపొర్లడం వంటి పరిణామాలతో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇతర ప్రకృతి విపత్తుల ముప్పు మరింత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. హిమానీనదాలు కరిగిపోవడానికి ప్రధాన కారణం ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల (గ్లోబల్‌ వార్మింగ్‌) అని స్పష్టం చేశారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెన్‌ హజార్డ్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన పరిశోధకురాలు నీ యాంగ్‌ మాట్లాడుతూ.. చైనా దక్షిణ సరిహద్దులకు సమీపంలోని హిమాలయ ప్రాంతంలో హిమానీనద సరస్సుల సంఖ్య, విస్తీర్ణంలో అత్యంత స్పష్టమైన పెరుగుదల నమోదవుతోందన్నారు. ఈ పరిణామం భారత్‌, నేపాల్‌కు ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో హిమానీనద సరస్సుల విస్తీర్ణం ఏటా సగటున ఒక్క శాతం చొప్పున పెరుగుతోందని నీ యాంగ్‌ తెలిపారు. హిమానీనదాల కరుగుదల ఇదే వేగంతో కొనసాగితే భవిష్యత్తులో హిమాలయ ప్రాంతంలో హిమానీనద సరస్సుల విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల ముప్పు మరింత తీవ్రం కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్