- ఐదుగురు అమెరికా పౌరులు మృతి
నైరోబీ: మధ్య కెన్యాలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఈక్వెడార్ జాతీయ ఇంటెలిజెన్స్ చీఫ్ మిషెల్ సెన్సీ-కొంటుగీ, ఆయన భార్య, ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరోబీకి ఉత్తరంగా ఉన్న సంబూరు కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. లోయిసాబా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్లో ఒక పైలట్తో పాటు ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని విమాన ప్రమాద దర్యాప్తు విభాగం తెలిపింది. ప్రమాద స్థలం కఠినమైన భూభాగంలో ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చీకటి పడటంతో బుధవారం రాత్రి సహాయక చర్యలను నిలిపివేసి, గురువారం తిరిగి ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ అధిపతి సెన్సీ-కొంటుగీ, ఆయన భార్య ఉన్నట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ధృవీకరించారు. 42 ఏళ్ల సెన్సీ-కొంటుగీ 2024లో ఈక్వెడార్ జాతీయ ఇంటెలిజెన్స్ సెంటర్కు అధిపతిగా నియమితులయ్యారు.
ప్రమాదంలో ఐదుగురు అమెరికా పౌరులు మృతి చెందినట్లు అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. మృతుల్లో టెలిముండో సీనియర్ మేనేజర్ జోస్ ఆల్బెర్టో సువారెజ్ కూడా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. హెలికాప్టర్ పర్యాటకులను విహారయాత్రకు తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.







కామెంట్లు (0)